Sandhya reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ఫీల్డ్ స్థానిక ఎన్నికల్లో గత ఏడాది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కౌన్సిలర్గా గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్టు స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. ఆస్ట్రేలియాలో పెద్ద పార్టీలైన లేబర్, లిబర్ పార్టీల అభ్యర్థులను వెనక్కినెట్టి ఉత్కంఠభరితమైన పోరులో నాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె విజయం సాధించారు. ఈ నెల 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్గా, కౌన్సిలర్ సంధ్యారెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ చరిత్రలోనే ఇద్దరు మహిళలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను అధిరోహించడం ఇదే తొలిసారి. స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్లో 50 వేల మంది జనాభా, 25 వేల మంది ఓటర్లు ఉంటారు. స్థానికంగా ఉన్నవారికే అక్కడివారు పట్టం కడుతుంటారు. అయితే, కౌన్సిలర్గా సంధ్యారెడ్డి చేస్తున్న సేవలను గర్తించిన ఆస్ట్రేలియన్లు రాజకీయాలకు అతీతంగా ఆమెను గెలిపించుకున్నారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సంధ్యారెడ్డికి తెలంగాణ ఎన్నారైలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్ట్రేలియన్లకు ప్రాతినిధ్యం వహిస్తూనే, ఆస్ట్రేలియాలోని తెలంగాణ బిడ్డలకు అండగా నిలబడతానని వెల్లడించారు.
హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన సంధ్యారెడ్డి తల్లిదండ్రులు పటోల్ల శంకర్రెడ్డి, సరళారెడ్డి. అబిడ్స్లోని స్టాన్లీ స్కూల్, సెయింట్ఆన్స్లో చదివారు. కేంద్రియ విశ్వవిద్యాలయం నుంచి పీజీ చేసిన ఆమె ఆస్ట్రేలియాలో స్థిరపడిన కర్రి బుచ్చిరెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె సామాజికు సేవకు 2020లో ‘స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ లభించింది.
బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా నియమితులైన సంధ్యారెడ్డి మొదటి భారత సంతతి మహిళ, అందులోనూ ఆమె తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగిన విషయమని అన్నారు. ఈ సందర్భంగా సంధ్యారెడ్డిని ఆయన అభినందించారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.