హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: జనగామ మున్సిపల్ కమిషనర్ పట్ల ఆర్డీవో వ్యవహరించిన తీరును తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేస్తారని, రెవెన్యూ అధికారుల కింద కాదనే విషయాన్ని గుర్తించాలని టీజీవో అధ్యక్షురాలు, మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు మమత, అధ్యక్షుడు కృష్ణమోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాబెర్ అలీ, కోశాధికారి శ్రీధర్ సూచించారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని, అనేక అవార్డులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ల మనోభావాలను, ఆత్మాభిమానం దెబ్బతీయొద్దని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో జనగామ ఆర్డీవో తీరును ఖండిస్తూ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు తగవు: టీజీవో
విధి నిర్వహణలో జనగామ మున్సిపల్ కమిషనర్ రజితపై ఆర్డీవో మధుమోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) తీవ్రంగా మంగళవారం ఒక ప్రకటనలో ఖండించింది. మహిళా అధికారి అని చూడకుండా మాట్లాడటాన్ని సంఘం అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తప్పుపట్టారు. తోటి ఉద్యోగులు, అధికారులను గౌరవించాల్సిన ఉన్నతాధికారి ఇలా వ్యవహరించడం తగదని హితవుపలికారు.