హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. పార్ట్-ఏ ప్రశ్న పత్రాల్లో కొన్ని మార్పులు చేసే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అయితే పార్ట్-బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నల్లో మార్పులు జరిగే అవకాశాలు లేవు. ఇటీవలే పదో తరగతి పరీక్షల విధానంలో కీలక సంస్కరణలు చేస్తూ ప్రభుత్వం జీవో 33ను విడుదల చేసింది. ప్రశ్నపత్రాలను 11 నుంచి 6 పేపర్లకు కుదించింది. ఈ నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మాదిరి (మాడల్) ప్రశ్నపత్రాలను ఎస్సీఈఆర్టీ అధికారులు విడుదల చేశారు. 2 మార్కుల ప్రశ్నలు, 3 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలతో వీటిని రూపొందించారు.
2, 3 మార్కుల ప్రశ్నల్లో మొత్తం రాయాల్సి ఉండగా, కేవలం 5 మార్కుల ప్రశ్నలైన వ్యాసరూప ప్రశ్నల్లో మాత్రమే చాయిస్ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసి, అన్ని ప్రశ్నల్లో చాయిస్ ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించాయి. ఆయా వినతులను పరిగణనలోకి తీసుకొన్న అధికారులు విషయ నిపుణులతో సమీక్షించి కొన్ని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వం ఆమోదానికి పంపించారు. ఈ ప్రతిపాదనలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానుండగా, వీలైనంత త్వరగా చాయిస్ ప్రశ్నలపై తేలుస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.