హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 16: దళితబంధు పథకంపై ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరూ నమ్మొద్దని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దళితబంధు డబ్బులు రావని, వచ్చినోళ్లవి గుంజుకుంటారని కొందరు దళితుల్లో అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దళితబంధు డబ్బులను ఎవరూ గుంజుకోరని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నారు. దళితబంధు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్కు మాదిగలు మద్దతు పలుకాలని కోరారు.