ముషీరాబాద్, డిసెంబర్ 15: మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ దళితులపై దాడులు చేస్తున్న బీజేపీని రాజకీయంగా బొందపెడతామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నదని మండిపడ్డారు.
గురువారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మతోన్మాద బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ పరిష్కరించకుండా మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, వెంకన్న, తిరుమలేశ్, శ్రీకాంత్, నాగరాజు, సురేశ్ పాల్గొన్నారు.