బెంగళూరు: ఒక మహిళ తన ప్రియుడికి బ్రెకప్ చెప్పింది. ఇది తెలుసుకుని ప్రియుడి సోదరుడు ఆగ్రహించాడు. ఆ మహిళను కత్తితో పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో నిందితుడితో పాటు మహిళ ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (Law Student Killed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కోడిహళ్లి ప్రాంతంలో నివసించే అమృత లా చదువుతున్నది. ఒక పిజ్జా అవుట్లెట్లో పార్ట్-టైమ్ ఉద్యోగం కూడా చేసింది.
కాగా, ధనుష్ అనే వ్యక్తితో అమృతకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారు. అయితే ధనుష్కు పెళ్లై విడాకులు తీసుకున్నాడని, అతడికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు అమృతకు తెలిసింది. ఈ విషయం దాచాడన్న కారణంతో అతడికి బ్రేకప్ చెప్పింది.
మరోవైపు అమృత బ్రేకప్ నిర్ణయం పట్ల ధనుష్ సోదరుడు సూర్య ఆగ్రహించాడు. ఆమెను బెదిరించాడు. జూలై 13న అమృత ఇంటి వద్ద ఆమెను అడ్డుకోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సూర్య కత్తితో అమృతపై దాడి చేశాడు. ఆమె ఛాతి, వీపు వెనుక కత్తితో పొడిచి పారిపోయాడు.
అయితే తీవ్రంగా గాయపడిన అమృత చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన సూర్యతో పాటు ధనుష్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.