అవార్డు అందజేసిన ఐఎఫ్ఐఈ
ఇది గ్రీన్ ఇండియా చాలెంజ్కు గౌరవం
మరింత ఉధృతంగా ముందుకెళ్తాం: ఎంపీ సంతోష్కుమార్ వెల్లడి
మరో 28 మందికి అవార్డులు అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్కు ప్రతిష్ఠాత్మక ‘చాంపియన్స్ ఆఫ్ ది చేంజ్’ అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్ తాజ్డెక్కన్లో ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ (ఐఎఫ్ఐఈ) సంస్థ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానంచేశారు. ఎంపీ సంతోష్ తరఫున గ్రీన్ చాలెంజ్ కోఆర్డినేటర్ రాఘవ.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. అవార్డు స్వీకారోత్సవానికి అందుబాటులో లేనందున ఎంపీ సంతోష్.. తన సందేశాన్ని పంపారు. ‘జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో జ్యూరీ అవార్డుకు నన్ను ఎంపిక చేయటం ఆనందంగా ఉన్నది. ఐఎఫ్ఐఈ చైర్మన్ నందన్ ఝాకు కృతజ్ఞతలు. ఈ అవార్డు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీన్ని పచ్చని ప్రకృతి కోసం, భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.
గ్లోబల్ వార్మింగ్ను అరికట్టాలని, గ్రీన్ హౌజ్ వాయువులను తగ్గించాలని, పచ్చగా తెలంగాణ పరిఢవిల్లాలని ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ ఇప్పటికే కోట్లాది ప్రజలను చేరింది. వారితో కోట్ల మొక్కలను నాటించింది. దీన్ని నిరంతరం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు. ఎంపీ సంతోష్తోపాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇండియన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి, మైహోం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, తెలంగాణ ఇంచార్జి డీజీపీ అంజనీకుమార్, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు మహేశ్బాబు, అల్లుఅర్జున్, సమంత, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జ్యోత్స్న రెడ్డి, సుధారాణి రెడ్డి, శశి జాలిగామ, మనీశ్ దోషి, దిరిసాల నరేశ్ దరి, డాక్టర్ రాజా తంగప్పన్ తదితరులకు ఈ అవార్డును అందజేశారు.