సంబంధించిన టీషర్టు… నెత్తిపై క్యాపు.. వీపులో బ్యాగు… బండికి మరో సంచీ.. వేగంగా వెళ్లే వాహనం.. ఇవన్నీ చూడగానే ఎవరో ఫుడ్ డెలివరీ బాయ్ అర్జెంట్గా పార్శిల్ ఇచ్చేందుకు వెళ్తున్నట్టున్నాడే.. అనుకోవడం ఖాయం. నిన్నటి వరకు అందరూ అనుకున్నది ఇదే. కానీ.. లాక్డౌన్ తనిఖీల్లో విస్మయపర్చే నిజాలు బయటపడ్డాయి. వాళ్లకు ఎలాంటి ఆర్డర్లూ రాలేదు. అయినా సరే.. తమ బంధువులు ఇచ్చిన టీషర్టులు వేసుకొని కొందరు… ఏకంగా కొనుక్కొని మరికొందరు డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తుతున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? లాక్డౌన్ సమయంలో ముఖ్యమైన పనులు లేకున్నా బయట తిరగాలన్న పైత్యం. కానీ.. పోలీసులు ఊరుకుంటారా ? వీరి పని పట్టారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో ఇలా షికార్లకొచ్చిన దాదాపు 50 మందిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు… ఇలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
ఇంతటితో ఉల్లంఘనులు ఆగిపోయారా అంటే.. అస్సలే కాదు. ఏకంగా పోలీసులనే బోల్తా కొట్టించే పని ప్రారంభించారు. చెక్పోస్టుల వద్ద ఫేక్ మెసేజ్లు, నకిలీ డాక్టర్ అపాయింట్మెంట్లు, పాత మెడికల్ రశీదులు చూపించడం ప్రారంభించారు. తొలి రోజుల్లో ఇలాంటి వారిని హెచ్చరించి వదిలిపెట్టిన పోలీసులు.. ఇప్పుడు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఒక్కరోజులోనే నిబంధనలు ఉల్లంఘించిన 3,878 వాహనాలను జప్తు చేశారు. ఇక శుక్రవారం నగరంలో డీజీపీ మహేందర్రెడ్డితోపాటు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్ తనిఖీలు నిర్వహించారు.
లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు 3 కమిషనరేట్ల పరిధిలో 301 చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నాం. వారికి లాక్డౌన్ తర్వాతే మళ్లీ బండ్లు అప్పజెప్తాం. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ను ఇక నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తాం. . పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించిన తర్వాతే పంపిస్తాం. 102 జీవో మార్గదర్శకాల ప్రకారమే అందరూ నడుచుకోవాలి. లేకపోతే ఇచ్చిన పాసులను రద్దు చేస్తాం.- మూడు కమిషనరేట్ల సీపీలు
కేపీహెచ్బీకాలనీ, జీడిమెట్ల : అనవసరంగా బయటకు రావొద్దని ఎంత చెప్పినా వినడం లేదు…. స్వీయ నిర్బంధం పాటించాలని కోరుతున్నా…చెవికెక్కడం లేదు. ఇంట్లో వారికి ఒంట్లో బాగలేదని కొందరు….పాత మందుల చీటీలు, పాసులతో మరికొందరు.. డెలివరీ టీషర్టులు ధరించి..ఇంకొందరు….ఇలా ఏవో సాకులు.. ఎన్నెన్నో కారణాలు.. ఉద్దేశం మాత్రం ఒక్కటే.. రోడ్లపైకి రావడం.. ఇష్టానుసారంగా చక్కర్లు కొట్టడం..ఇలా యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు శనివారం మరింత కఠినంగా వ్యవహరించారు. అవసరమున్న చోట లాఠీలకూ పనిచెప్పారు. అకారణంగా రహదారులపై వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. వాహనాలను జప్తు చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో స్వయంగా రంగంలోకి దిగిన పోలీసు బాసులు వివిధ చోట్ల పర్యటించారు.
డీజీపీ మహేందర్రెడ్డితో సహా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్భగవత్, సజ్జనార్లు లాక్డౌన్ అమలును పరిశీలించారు. కేపీహెచ్బీ కాలనీ మెట్రో స్టేషన్ వద్ద సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు కారణాలతో వెళ్తున్న వారి వెహికిల్స్ను జప్తు చేసి.. కేసులు పెట్టారు. నిబంధనలు పాటించకపోవడంతో షాపూర్నగర్ హోటల్ చౌరస్తా చెక్ పోస్టు వద్ద రంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడి కారును సీజ్ చేశారు. డ్రైవర్ను మందలించారు. ఏసీపీ పురుషోత్తం ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు.. ఆ వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు.
లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఒక పక్క కేసులు నమోదు చేస్తూ.. మరో పక్క వాహనాలను సీజ్ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే నగర ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో 3878 వాహనాలను సీజ్ చేశారు. కాగా.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి శుక్రవారం వరకు నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో అసెంబ్లీ, పంజాగుట్ట, బేగంపేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుల వద్ద లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పరిశీలించాను. ఐదు జోన్లలో డీసీపీలు, జాయింట్ సీపీలు, ఏసీపీలు ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్ పుడ్ డెలివరీకి సంబంధించిన కొందరు లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు తమ వద్ద ఉన్న పుడ్ డెలివరీ యాప్లకు సంబంధించిన టీ షర్ట్స్ను ఇస్తున్నారు. వాటిని ధరించి.. రోడ్లపై తిరుగుతున్నారు. కనీసం ఒక గుర్తింపు కార్డు, ఆర్డర్ వచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాం. కచ్చితంగా తనిఖీల అనంతరమే వాళ్లను వదిలేయాలని ఆదేశించాం. ఫుడ్డెలివరీ పేరుతో దుర్వినియోగానికి పాల్పడ్డ 25 మందిపై కేసులు నమోదు చేశాం. – సీపీ అంజనీకుమార్
స్విగ్గీ, జొమాటో, ఇతర ఫుడ్ డెలివరీ వారు కూడా తమ దుస్తులను ఇతరులకు ఇచ్చి వారిని రోడ్లపైకి పంపిస్తున్నారు. కొందరు చెక్పాయింట్ల వద్ద పోలీసులకు ఫేక్ మెసేజ్లు, డాక్టర్ అపాయింట్మెంట్లు, పాత మెడికల్ రశీదులను చూపించి.. మందులకు వెళ్తున్నామని బోల్తా కొట్టిస్తున్నారు. రోజు రోజుకు ఇలాంటి ఉల్లంఘనలు తీవ్రతరం కావడంతో శనివారం నుంచి లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. ఇక నుంచి స్విగ్గీ, జొమాటో వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. తప్పనిసరిగా వారికి వచ్చిన ఆర్డర్లు, డెలివరీ లొకేషన్, టైమింగ్ తదితర అంశాలను పరిశీలిస్తాం. ఇప్పటికే దాదాపు 1800 పై వాహనాలను సీజ్ చేశాం. లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు 26 వేల కేసులను నమోదు చేశాం. – మహేశ్ భగవత్, అదనపు డీజీపీ, రాచకొండ పోలీసు కమిషనర్
నిబంధనలను ఉల్లంఘించిన వారితో చాలా కఠినంగా ఉంటాం. ముఖ్యంగా తప్పుడు అనుమతి పత్రాలు తయారు చేసి, ఫేక్ మెసేజ్లను చూపించి రోడ్లపై రావాలనుకుంటున్న వారి వాహనాలను అక్కడిక్కడే జప్తు చేస్తాం. వారి వాహనాలను తిరిగి ఇవ్వడానికి లాక్డౌన్ పూర్తవ్వాలి. ఇప్పటికే లాక్డౌన్ నిబంధనలను పాటించని వారిపై దాదాపు 30 వేల వరకు చలాన్లను జారీ చేశాం. తాజాగా 2 వేలకు పైగా వాహనాలను జప్తు చేశాం. శనివారం నుంచి నిబంధనలను మరింతగా కఠినంగా అమలు చేస్తుండడంతో చాలా మంది నకిలీలు దొరికిపోయారు. -సజ్జనార్, అదనపు డీజీపీ సైబరాబాద్ పోలీసు కమిషనర్
లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. కేపీహెచ్బీకాలనీ, కూకట్పల్లి, బాలానగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావుతో కలిసి పరిశీలించారు. ప్రజలు అనవసరంగా రోడ్లుపైకి రావొద్దని… అత్యవసరమైతేనే రావాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి.. వాహనాలను జప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
నగరంలో సరుకు రవాణా వాహనాలు కేవలం రాత్రి 9 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే తిరుగాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆక్సిజన్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, ఆక్సిజన్ ట్యాంకర్లు, మెడికల్కు సంబంధించిన పరికరాలను తీసుకెళ్లే వాహనాలు, వాటర్ ట్యాంకులకు ఎలాంటి ఆంక్షలు లేవని, లాక్డౌన్ సమయంలో వీటికి అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు.