Telangana | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం దేశం ముందు మరోసారి సాక్షాత్కారమైంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దేశానికి తెలంగాణ దన్నుగా నిలిచింది. ‘ఆదాయం పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. అనతికాలంలోనే తెలంగాణ ఆర్థిక ప్రగతి అగ్రపథాన నిలిచిం ది. అతి తక్కువ సమయంలో సుసంపన్న రాష్ట్రంగా దేశం కీర్తిని అందుకున్నది. ఈ విషయాన్ని లోక్సభ సాక్షిగా కేంద్రమే అంగీకరించింది. దేశానికి ఆర్థిక భరోసానిస్తున్న రాష్ర్టా ల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని కేంద్రమే ప్రకటించింది. సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బిట్రాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ఆరేండ్లలో దేశ జీడీపీకి తెలంగాణ వాటా 72 శాతం పెరిగిందని లోక్సభ సాక్షిగా అంగీకరించారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నదని, దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో కీలకంగా మారిందని రుజువైంది. తెలంగాణపై కేంద్రం చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది.
దేశ చరిత్రలో తెలంగాణది భౌగోళికంగా 11వ స్థానం. జనాభా పరంగా 12వ స్థానం. దేశ ఆర్థిక ప్రగతిలో మాత్రం తెలంగాణదే అగ్రపథం. ఒక దేశ ఆర్థిక ప్రగతిని ఆ దేశ జీడీపీని బట్టి అంచనా వేస్తారు. దేశ జీడీపీలో తెలంగాణది పెద్దన్న పాత్రని కేంద్రమే అంగీకరించింది. 2017-18 లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,79,358. ఆ తర్వాత ప్రతిఏటా తెలంగాణ వృద్ధి రేటును నమోదు చేస్తూనే ఉన్నది. తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104. అప్పటికి తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ స్థానం 10. కా నీ.. అనతికాలంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి ఎగబాకింది. తెలంగాణ కంటే చరిత్రలోనూ, ఆర్థికంగానూ ఎంతో పెద్ద రాష్ర్టాలన్నింటినీ వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లింది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశ తలసరి ఆదాయం రూ.1,72,000 మాత్రమే. అంటే.. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,36,732 ఎక్కువ. జీఎస్డీపీలోనూ తెలంగాణ అనూహ్యమైన వృద్ధిరేటును నమోదు చేసింది. 2017-18లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.7,50,050 లక్షల కోట్లు ఉండగా.. 2022-23వ ఆర్థిక సంవత్సరానికి రూ.12,93,469 లక్షల కోట్లకు ఎగబాకింది.
దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణను కేంద్రం మరింతగా ప్రోత్సహించాల్సింది పోయి రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. తెలంగాణ ఆర్థిక ప్రగతి పరుగును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. ఆరేండ్లలో దేశ జీడీపీకి తెలంగాణ సాయం 72 శాతం పెరిగితే… కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే పన్నుల్లో వాటా మాత్రం అందులో 10వ వంతు కూడా పెరగలేదు. 2018-19లో కేంద్రం నుంచి తెలంగాణకు పన్నుల్లో వాటా రూ.18,560 కోట్లు. ప్రపంచమంతా కరోనాతో స్తంభించిపోయిన 2019-20లో రూ.15,987 కోట్లకు చేరింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం 2020-21కి వచ్చేసరికి రూ.12,691కి పడిపోయింది. 2021-22లో రూ.18,720కి చేరింది. 2022- 23లో కేంద్రం నుంచి అందిన పన్నుల వాటా రూ.19,668 కోట్లు. ఒకవైపు తెలంగాణ ఆర్థికంగా బలపడుతున్నదని చెప్తున్న కేంద్రం.. మరోవైపు పన్నుల్లో వాటాను మాత్రం సరిగా ఇవ్వడం లేదు.
పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలకు హక్కుగా పంచాల్సి ఉంటే.. కేంద్రం మాత్రం 29.6 శాతమే ఇస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఆర్థిక మంత్రి హరీశ్రావు అనేకసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగిలిన 11.4 శాతం సెస్సుల రూపంలో కేంద్రం తన దగ్గరే ఉంచుకుంటున్నదని మండిపడ్డారు. 2014 వరకు సెస్లు 10 శాతమే ఉండేది. కానీ.. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టి తర్వాత సెస్లను 20 శాతానికి పెంచేశారు. దీనిపై తెలంగాణతోపాటు దేశంలోని అనేక రాష్ర్టాలు అభ్యంతరం తెలిపాయి. తెలంగాణ ఆర్థిక రంగంపై కేంద్రం ఎన్నిసార్లు అసత్య ప్రచారం చేసినా.. కాగ్, ఆర్బీఐ తదితర నివేదికలు తెలంగాణ ఆర్థిక ప్రగతిని కొనియాడుతూనే ఉన్నాయి. ఫలితంగా.. కేంద్రం తప్పక తెలంగాణ ఆర్థిక ప్రగతిని లోక్సభలో అంగీకరించాల్సిన పరిస్థితి. తెలంగాణ ఆర్థిక ప్రగతిని లోక్సభ సాక్షిగా కేంద్రం అంగీకరించడం ఇదే తొలిసారి కాదు. ప్రతి లోక్సభ సమావేశాల్లోనూ కేంద్రం చెప్పే లెక్కలతో తెలంగాణ ఆర్థిక వృద్ధిని దేశమంతా కీర్తిస్తూనే ఉన్నది.