సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ కట్టపై జైకేసీఆర్.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, తుమ్ ఆగే బడో, హమ్ తుమారే సాథ్ రహే, కేసీఆర్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న మహారాష్ట్ర రైతు నేతలు.
ఆదివారం సిద్దిపేట జిల్లాలో మహారాష్ట్రకు చెందిన 150 మంది రైతుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలో రైతువేదికలు, వ్యవసాయ మార్కెట్లను, నూతన కలెక్టరేట్ భవనాలను పరిశీలించింది.
సిద్దిపేట, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలు, మండుటెండల్లోనూ కాల్వలు, చెరువులు, చెక్డ్యాముల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. మా వద్ద పుట్టిన గోదావరి జలాలు తెలంగాణలోని కాలువలు, వాగుల్లో చూస్తే సంబురంగా ఉన్నది. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకడం ఇక్కడే కనిపిస్తున్నది. రైతులు బాగుండాలన్న సీఎం కేసీఆర్ సం కల్పం చాలా గొప్పది. ఇక్కడి పథకాలు మా రాష్ట్రంలోనూ కావాలి. సీఎం కేసీఆర్తోనే మహారాష్ట్ర అభివృద్ధి సా ధ్యం. దేశానికి కేసీఆర్ అవసరం ఉన్నది. తెలంగాణ మొత్తాన్ని సీఎం కేసీఆర్ సార్ సస్యశ్యామలం చేశారు’ అని మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ప్రశంసించారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలో మహారాష్ట్రకు చెందిన 150 మంది రైతుల బృందం పర్యటించింది. వీరితో మంత్రి హరీశ్రావు నంగునూరు మండలం ఘనపూర్ చెక్డ్యాం వద్ద సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మించిన పలు భారీ ప్రాజెక్టులతోపాటు పలు పథకాలను వివరించారు.
దేశ్ కీ నేత కేసీఆర్
దేశ్కీ నేత కేసీఆర్ అంటూ మరాఠా రైతులు గజ్వేల్ సమీకృత మార్కెట్లో నినాదాలు చేశారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్, తుమ్ ఆగే బడో, హమ్ తుమారే సాథ్ రహే, కేసీఆర్ జిందాబాద్’ అని నినదించారు. గజ్వేల్ సమీకృత మార్కెట్ నిర్మాణం గురించి స్థానిక ప్రజాప్రతినిధులు మహారాష్ట్ర రైతులకు వివరించారు.కోమటిబండలోని మిషన్ భగీరథ నాలెడ్జ్ కేంద్రంలో ఫొటో గ్యాలరీ ద్వారా ఎస్ఈ శ్రీనివాసాచారి గోదావరి జలాల తరలింపు, నీటి శుద్ధీకరణ, ఇంటింటికీ మంచినీళ్ల పంపిణీ విధానాన్ని రైతులకు వివరించారు. మిషన్ భగీరథ పథకం అమలు తీరును తెలుసుకొన్న రైతులు ముచ్చటపడ్డారు. ములుగు రైతు వేదికలో స్థానిక రైతులతో మహారాష్ట్ర ప్రతినిధులు సమావేశమయ్యారు. గౌరారం రాజీవ్ రాహదారి పక్కనే ఉన్న సింగాయిపల్లి అటవీ ప్రాంత పచ్చదనాన్ని చూసి మహారాష్ట్ర రైతులు సంబురపడ్డారు. డీఎఫ్వో శ్రీనివాస్ ఫొటో గ్యాలరీ ద్వారా అడవుల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు.
మల్లన్నసాగర్ మహాద్భుతం
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ పంప్హౌస్, రిజర్వాయర్లోని నీళ్లను రైతు నేతలు పరిశీలించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. ప్రాజెక్టు విశేషాలను ఈఎన్సీ హరిరాం వివరించారు. మల్లన్నసాగర్ పంప్హౌస్ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు, కొండపోచమ్మ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నట్టు తెలిపారు. 600 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను తెచ్చి నిలువ చేయడంపై మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాజెక్టు డెలివరీ చానల్ను పరిశీలించారు. పంప్హౌస్లో, మల్లన్నసాగర్ కట్ట మీద సెల్పీలు దిగడానికి రైతు సంఘాల ప్రతినిధులు పోటీపడ్డారు. బృందం సభ్యులకు వంటిమామిడి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు జహంగీర్, శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకులు, రైతులు ఘనస్వాగతం పలికారు.
కేసీఆర్ రావాలి.. రైతుల రాత మారాలి
రైతు సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని మహారాష్ట్ర రైతు నేతలు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు ఉండటంతో రైతులు వ్యవసాయం చేసుకొంటున్న విధానంపై మహారాష్ట్ర రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కండ్లారా తెలంగాణ అభివృద్ధిని చూస్తే కడుపునిండిందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ దేశంలో రావాలన్నదే మహారాష్ట్ర ప్రజల కోరిక అని తెలిపారు.
బీఆర్ఎస్ సర్కార్ రావాలి
మహారాష్ట్రలో 12 వేల రూపాయలు చెల్లిస్తేనే కరెంట్ పోల్ ఇస్తారని రైతులు వాపోయారు. తెలంగాణలో మంచి మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారని, రైతుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ అన్నదాత కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్రావు కదం, కిసాన్ సెల్ యూత్ అధ్యక్షుడు సుధీర్ బిందు, నాందేడ్ జిల్లా కిసాన్ సెల్యూత్ అధ్యక్షుడు నవీన్ పాటిల్, ఎమ్మెల్సీ దండె విఠల్, సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సంకల్పం బలంతోనే కాళేశ్వరం: హరీశ్రావు
సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా నంగునూరు మండలం ఘనపూర్ చెక్డ్యామ్ను మహారాష్ట్ర రైతు బృందానికి మంత్రి హరీశ్రావు స్వయంగా చూపించారు. కాళేశ్వరం జలాలతో చెక్డ్యామ్ నింపినట్టు తెలిపారు. అక్కడే రైతులతో మంత్రి ముచ్చటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి రాత్రులు, పగలు అనే తేడా లేకుండా పనిచేశామని చెప్పారు. మోటర్లను నాలుగైదు దేశాల నుంచి తెప్పించామని చెప్పారు. నేడు తెలంగాణలో యాసంగిలోనూ 56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపినా ఫరవాలేదు కానీ, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు.
మహారాష్ట్ర రైతుల ప్రశ్నలకు హరీశ్రావు జవాబులు రైతుబంధుకు ఎంత ఖర్చు చేశారు..?
తెలంగాణలో 65 లక్షల మంది రైతులకు ఏటా రెండుసార్లు కలిపి ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు రూ.80 వేల కోట్లు ఖర్చు చేశాం.
రైతులకు మాత్రమే పథకాలా? అని అనుకుంటున్నారు. మీరేమంటారు?
మేము రైతులను బాగు చేసుకోవడంతోపాటు అన్నిరంగాలను గాడిలో పెట్టాం. పరిశ్రమల కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చి అనుమతులు ఇస్తున్నాం.
తెలంగాణలో అధిక ఆదాయం దేని నుంచి వస్తున్నది?
తెలంగాణలో అత్యధిక ఆదాయం జీఎస్టీ నుంచి వస్తున్నది. ఐటీ ఇండస్ట్రీ నుంచి పరోక్షంగా ఆదాయం వస్తున్నది.
ఇక్కడ ఏ పంటలు పండిస్తారు?
వరి ఎక్కువగా పండిస్తున్నారు. ఈ యాసంగిలో 54 లక్షల ఎకరాల వరి పండుతున్నది. దేశం మొత్తంలో 97 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే, 56 లక్షల ఎకరాలు తెలంగాణలోనే ఉన్నది.