నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 10: స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పో లింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసిం ది. 5 ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 90 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ తెలిపారు. అత్యధికంగా కరీంనగర్లో 99.70 శాతం, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. బ్యాలెట్ బాక్స్లను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలకు తరలించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఎవరైనా అభ్యర్థులకు అనుమానాలుంటే స్ట్రాంగ్ రూంలవద్ద తమ వారిని కాపాలాగా పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు తీయరాదని గోయల్ స్పష్టంచేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
సిరిసిల్లలో కేటీఆర్.. సిద్దిపేటలో హరీశ్రావు
ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులదే విజయమని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఆదిలాబాద్లో మంత్రి ఇం ద్రకరణ్రెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం 1,026 మంది ఉండగా, 1,018 మంది ఓటు వేశారు. ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదిలాబాద్, ఉట్నూర్, మంచిర్యాల, నిర్మల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గంలో మొత్తం 768 మంది ఓటర్లు ఉండగా, 738 మంది ఓటేశారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్కు సీపీఐ మద్దతు ఇచ్చింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో ఓటేశారు. కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి గంగుల కమలాకర్, ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్, బీజేపీ పారిపోయాయని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో 1,324 మంది ఓటర్లు ఉండగా 1,320 మంది ఓటేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓటు వేయలేదు. జగిత్యాల, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. నల్లగొండ నియోజకవర్గంలో 1,271 ఓట్లు ఉండగా, 1,233 ఓట్లు పోలయ్యాయి. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి ఓటు వేయగా, నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, హుజూర్నగర్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి ఓటు వేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు.
స్ట్రెచర్పై వచ్చి ఓటేసిన ఎంపీటీసీ
అనారోగ్యంతో దవాఖానలో ఉన్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ఎంపీటీసీ చాడ శోభ స్ట్రెచర్పై వచ్చి ఓటు వేశారు. కాలుకు శస్త్ర చికిత్స జరగడంతో కొంతకాలంగా కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో ఆమె చికిత్స పొందుతున్నారు. నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో వచ్చి ఓటేశారు.
అన్న మరణించినా ఓటేసిన చెల్లి
సోదరుడు మరణించినా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. మెదక్ జిల్లా కొల్చారం జడ్పీటీసీ మేఘమాల అన్న కొన్యాల మధుసూదన్ అనారోగ్యంతో గురువారం రాత్రి మరణించారు. శుక్రవారం అంత్యక్రియలు ముగియకపోయినప్పటికీ బాధను దిగమింగుకొని నర్సాపూర్లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆమె ఓటేశారు. ఓటేసిన అనంతరం భోరున విలపించిన ఆమెను ఎమ్మెల్యే మదన్రెడ్డి ఓదార్చారు.
లండన్ టూ లంకపల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీ చిలుకూరి శ్యామల లండన్ నుంచి వచ్చి ఓటేశారు. కొన్నిరోజుల క్రితం ఆమె లండన్ వెళ్లారు. ఈలోపునే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో రెండురోజుల క్రితం లంకపల్లికి చేరుకొన్నారు. శుక్రవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇంద్రకరణ్రెడ్డికి సీఎం ఫోన్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి శుక్రవారం మధ్యాహ్నం ఫోన్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకొన్నారు. పోలింగ్పై స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన సూచనలు చేయాలని కోరారు.