హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎం సంజయ్కుమార్తోపాటు అసెంబ్లీ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ప్రతివాదులకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయడానికి పిటిషనర్లకు అనుమతిచ్చింది. కడియం, సంజయ్పై అనర్హత వేటు వేయాలనే తమ పిటిషన్లను స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జీ జగదీశ్రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
ఇప్పటికే పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు బుధవారమే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ తరఫున ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన టీ ప్రకాశ్గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు కేసులన్నింటినీ ఏప్రిల్ 16న విచారణ చేపడుతామని ధర్మాసనం వెల్లడించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీపతి సంతోష్కుమార్, ఎల్ వెంకటేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ, స్టేషన్ఘన్పూర్, జగిత్యాల నియోజకవర్గాల నుంచి కడియం శ్రీహరి, ఎం సంజయ్కుమార్ను బీఆర్ఎస్ తరఫున ప్రజలు ఎన్నాకున్నారని, అయితే వారు ప్రజాతీర్పును కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు.
కడియం తన కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభ టికెట్ సాధించి ఎన్నికల్లో బాహాటంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారని వివరించారు. సంజయ్కుమార్ కూడా కాంగ్రెస్లో చేరడమే కాకుండా ఆ పార్టీ కండువాను కప్పుకొన్నారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారని, పత్రికలు, టీవీల్లో వార్తలు వచ్చాయని తెలిపారు.బాహాటంగా పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ బయట జరిగిన కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పీకర్ తేల్చడం చట్ట వ్యతిరేకమని వాదించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టుగా ఆధారాలు చూపినా వాటిని స్పీకర్ పట్టించుకోలేదని, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పాలని కోరారు. ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనల అనంతరం సదరు ఎమ్మెల్యేలపై గతంలో దాఖలైన ఏడు పిటిషన్లు, బీజేపీ దాఖలు చేసిన మరో పిటిషన్ వ్యాజ్యాలను ఏప్రిల్ 16న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది.