హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీరు, కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్పై మంత్రులు చర్చిస్తున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటింటా జ్వరసర్వే నిర్వహించాలని, లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందించాలని యోచిస్తోంది. ఫీవర్ సర్వేపై మంత్రులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 24 వేలు దాటింది. 1,773 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 2.71 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 66 వేల మందికి మొదటి డోస్, 1.91 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 13 వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. బుధవారంతో రాష్ట్రంలో పంపిణీ చేసిన డోసుల సంఖ్య 5.12 కోట్లుగా నమోదైంది.