హైదరాబాద్ : ఈ నెల 21 లేదా 22వ తేదీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, మల్లారెడ్డి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాలకు సంబంధించిన పండగులను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. గతేడాది కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించలేకపోయామని చెప్పారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. క్రిస్టియన్ సమాజంలో ఉన్న నిరుపేదలకు రూ. 11 కోట్ల 50 లక్షలు ఖర్చు పెట్టి నూతన వస్త్రాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీలోపు రెండున్నర లక్షల మందికి నూతన వస్త్రాల పంపిణీ జరుగుతుందన్నారు.