Ration Card | అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియ అని, చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు విషయమై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ, తదితర అంశాలపై శనివారం డాక్టర్ బీఆర్అంబేద్కర్ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా, కులగణన (సామాజిక) సర్వే ఆదారంగా తయారు చేసిందని, ఇది తుది జాబితా కాదన్నారు.
ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నదని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కొన్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి ట్రాప్లో అధికారులు పడకూడదన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభలలో దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరికలకు దరఖాస్తులు కూడా స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే, గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు.
ఈనెల 26 ప్రారంభించే నాలుగు పథకాలపై 21 నుండి ప్రారంభమయ్యే గ్రామసభల్లో ప్రజా అభిప్రాయాలు/ ఫీడ్ బ్యాక్ లను తీసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలు, ప్రజా పాలన సేవా కేంద్రాలలో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎండీఓ కార్యాలయంలో గల దరఖాస్తులను పరిశీలించాకే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తామని మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హుల తుది జాబితాలను ప్రకటించడానికి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు.ఇందిరమ్మఇండ్ల కేటాయింపు విషయమై ఇంటి స్థలం ఉన్న వారి జాబితా, ఇంటి స్థలం లేని వారి జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలన్నారు. కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను ఇస్తామని మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొన సాగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా కల్పిస్తామన్నారు. గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు తహసీల్దార్ల వద్ద ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్దిదారులను గుర్తించాలన్నారు.
ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప చేయడం జరుగుతుందని మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతీ కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తం బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీలలో కలపడం జరిగిందని, ఈ గ్రామాల్లో 2023 -24 లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలో తీసుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.