దేశంలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేయడంలో గిరిజనులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని, అత్యున్నత గౌరవ పురస్కారాలు పద్మశ్రీలను సాధిస్తున్నారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గత ఏడాది గుస్సాడి కనకరాజు పద్మశ్రీ పొందితే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన గిరిజన జానపద (డోలి, ఓకల్) కళాకారుడు రామచంద్రయ్య ఉండడం తెలంగాణకు, గిరిజన జాతికి గర్వకారణమని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రామచంద్రయ్యకు గిరిజన శాఖ మంత్రిగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కళలకు గొప్ప సేవ చేసి పద్మశ్రీ పొందిన పద్మజా రెడ్డి, కిన్నెర మొగిలయ్యలకి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనులు, మహిళలు మన రాష్ట్రం తరపున పద్మశ్రీ వంటి గొప్ప పురస్కారాన్ని సాధించడం రాష్ట్ర మహిళలు, గిరిజనులకు గొప్ప గౌరవం, స్ఫూర్తిదాయకం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో కళలు విలసిల్లుతున్నాయని, మహిళలు, అట్టడుగు వర్గాల కళాకారులు కూడా అత్యున్నత గౌరవాలను పొందుతున్నారు అని చెప్పడానికి ఈ పద్మశ్రీ పురస్కారాలు నిదర్శనం అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ రాష్ట్రం అంతరించిపోతున్న చేతి వృత్తులు, కళలకు జీవం పోసి కళాకారులను వెలుగులోకి తీసుకొస్తోందని స్పష్టం చేశారు. పద్మశ్రీ పొందిన గిరిజన కళాకారుడు రామచంద్రయ్యకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.