Komatireddy Venkat Reddy | హైదరాబాద్ : ‘రైతుబంధు పడలేదు అన్న వారిని చెప్పుతో కొట్టండి’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంకా రైతుబంధు పడలేదని అడుగుతున్నారు అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ… రైతుబందు పడలేదు అన్నవారిని చెప్పుతో కొట్టండి అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుబంధు పడలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ప్రశ్నించొద్దా అంటూ నిలదీస్తున్నారు.
గ్రామాల్లో రైతులు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు. తమకు రైతుబంధు పడలేదంటున్నారు. అంటే రైతులను చెప్పుతో కొట్టండి అనేనా మంత్రి మాటల అర్థం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో డిసెంబర్ 9వ తేదీన అర్భాటంగా ప్రారంభించిన రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ నెలన్నర రోజులు గడిచినా ఇంకా రెండు ఎకరాల వరకు కూడా పంపిణీ పూర్తి కాకపోవడం గమనార్హం. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వ్యాఖ్యల్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.