మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మోదీ సర్కారు చెప్తున్న గుజరాత్ అభివృద్ధి నమూనా అంటే చీకట్లోకి నెట్టడమేనా? అని ప్రశ్నించారు. వ్యవసాయానికి కేవలం 6 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్న గుజరాత్ సర్కారు సరిపడా కరెంట్ అందించలేక అక్కడి పరిశ్రమలకు వారంలో రెండు రోజులు సెలవులు ప్రకటించిందని ఎద్దేవా చేశారు. బుధవారం నల్లగొం డ జిల్లా మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో పర్యటించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 35 గ్రామాలకు చెందిన 376 మంది లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను మోదీ సర్కారు నిలువరిస్తూ అభివృద్ధికి మోకాలడ్డుతున్నదని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, ఇందుకు సీఎం కేసీఆర్కు ఉన్న దక్షతనే కారణమన్నారు.