జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి హరీశ్రావుతో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మునిసిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, నాయకులు కౌశిక్ రెడ్డి, సమ్మిరెడ్డి, రామస్వామి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘వేదికపై ఉన్న ముగ్గురు మంత్రులం 2001 నుంచి టిఆర్ఎస్లో ఉన్నం. ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినం. ఈటల 2004లో టీఆర్ఎస్లోకి వచ్చిండు. మధ్యలోనే వెళ్లిపోయిండు. కాంగ్రెసు అనేది ఇక్కడ లేదు,ఆ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే, డిపాజిట్ రానే రాదు. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ముస్లింలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 204 గురుకులాలను ప్రభుత్వం నడుపుతున్నది. ఎంతోమంది ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదివి విదేశాలలో మంచి ఉద్యోగాలు చేస్తున్నరు. షాదీ ముభారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్షా 116రూపాయలు ఉచితంగా అందిస్తున్నం’ అని తెలిపారు.
తల కిందికి కాళ్లు పైకి లేపినా ఈటల గెల్వడంటే గెల్వడు
‘జమ్మికుంట, హూజూరాబాద్లలో ఖబరస్థాన్ కోసం ఎకరన్నర చొప్పున మూడు ఎకరాలు మంజూరు చేస్తున్నం. జమ్మికుంట, హూజూరాబాద్లో షాదీఖానాలను నిర్మించి ఇస్తం. ఇల్లందకుంట, కమలాపూర్, వీణకుంట, హూజూరాబాద్, జమ్మికుంటలోని ముస్లింల సమస్యలను కూడా పరిష్కరిస్తం. బిజిగిరి దర్గా అభివృద్ధికి నిధులు కేటాయిస్తం. తల కిందికి కాళ్లు పైకి లేపినా ఈటల గెల్వడంటే గెల్వడు. పొరపాటున ఆయన గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం. టీఆర్ఎస్ గెలిస్తే మీరు గెలిచినట్లు, హూజూరాబాద్ మరింత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. డబుల్ బెడ్ రూంలు 4 వేలు కేటాయిస్తే రాజేందర్ ఒకటి కూడా కట్టలే. నేను సిద్దిపేటలో, బాన్సువాడలో స్పీకర్, జగదీశ్రెడ్డి సూర్యాపేటలో, జడ్చర్లలో లక్ష్మారెడ్డి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిండ్రు. మీకు సేవ చేసేందుకు గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డిలతో పాటు నేను, మంత్రులు ఈశ్వర్, మహమూద్ అలీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటం’ అని వెల్లడించారు.
టీఆర్ఎస్ మీకు కొండంత అండ : మహమూద్ అలీ
మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ఉద్యమంలో హరీశ్రావు చాలా గొప్ప పాత్ర పోషించిండు. సీఎం కేసీఆర్ ఏ పని అప్పగించినా నూటికి నూరు శాతం ఫలితం సాధిస్తడు. తెలంగాణ ఉద్యమంలో మా ముగ్గురితో పాటు గెల్లు శ్రీనివాస్ చురుకైన పాత్ర పోషించిండు. టీఆర్ఎస్ మీకు కొండంత అండ. కేసీఆర్ మనందరికి ధైర్యం. బీజేపీ ఢిల్లీ పార్టీ, అది మనకు వ్యతిరేకమైన పార్టీ. దేశంలో మరెక్కడా లేనివిధంగా కేసీఆర్ గురుకులాల ద్వారా మనకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా అందిస్తున్నారు. మన పిల్లలు ప్రభుత్వ సాయంతో విదేశాలలో ఉన్నత విద్య విద్య అభ్యసిస్తున్నరు. మన వాళ్లిప్పుడు శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అవుతున్నరు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.1,00,116 కేసీఆర్ ఇస్తున్నరు. మహిళల ప్రసవాలకు ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చారు. కేసీఆర్ కిట్లు ఇస్తున్నరు, అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. కోకాపేటలో ముస్లిం కన్వెన్షన్ సెంటర్ కట్టేందుకు రూ.10కోట్లు, 10ఎకరాలు కేటాయించారు. ముస్లింలు కోరుకునేది శాంతి, భద్రత.. అది కేసీఆర్తోనే సాధ్యం. ఆయన గొప్ప లౌకికవాది, మత సామరస్యాన్ని కాపాడుతున్నరు. నన్ను డిప్యూటీ సీఎంను, ఇప్పుడు హోం మంత్రిని చేసిండు. బీజేపీ ఏ ఒక్క రాష్ట్రంలో ముస్లిం నాయకుడికి పదవి ఇవ్వలే. గెల్లు శ్రీనివాస్ యువకుడు, కష్టపడి పని చేస్తడు మీరంతా ఓటేసి ఘన విజయం చేకూర్చండి, సేవ చేసే అవకాశం ఇవ్వండి’ అని కోరారు.
కేసీఆర్ గొప్ప సెక్యులర్: మంత్రి కొప్పుల ఈశ్వర్
సీఎం కేసీఆర్ గొప్ప సెక్యులర్ అని, అందరి మతవిశ్వాసాలను గౌరవిస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ‘తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రంజాన్ పండుగను అధికారంగా నిర్వహిస్తూ, పేదలకు ఉచితంగా దుస్తుల పంపిణీ చేస్తున్నారు. ముస్లింలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 204 గురుకులాలను నెలకొల్పారు. మిమ్మల్ని గత పాలకుల మాదిరిగా ఓట్ల కోసం, ఓటు బ్యాంకుగా చూడడం లేదు. జమ్మికుంటలో 5మసీదుల అభివృద్ధి కోసం రూ.50 లక్షలు కేటాయిస్తున్నం. ఖబరస్థాన్ కోసం రూ.70 లక్షలు ఇస్తున్నం, పెండింగ్ లోన్స్ ను త్వరలోనే అందిస్తం’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముస్లింలది క్రియాశీలక పాత్ర : గెల్లు
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో ముస్లింలు క్రియాశీల పాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా బ్రిటిషర్ల కుట్రలను తిప్పికొడుతూ ముస్లింలు, హిందువులు, సిక్కులు తమ ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ముస్లింలలోని పేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 204 గురుకులాలను నెలకొల్పారు. విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం 20లక్షలను ఉచితంగా అందిస్తున్నది’ అని వెల్లడించారు.