వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరికి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ను సాగు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని స్వయంగా తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి పంటను చూపించారు. పంటను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. ఆ పంట సాగులో పని చేస్తున్న రైతులు, కూలీలు, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి మంత్రులు చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా పామ్ ఆయిల్కు మంచి డిమాండ్ ఉందని మంత్రులు చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతులు లాభపడే అవకాశం ఉందన్నారు. రైతులు లాభాల్లో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, అందుకే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మంత్రి ఎర్రబెల్లి స్వయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తూ, అందరినీ ఉత్సాహపరుస్తున్నారని, తాను ఆచరిస్తూ అందరికీ చెప్పడం ఆయన గొప్పతనమని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ సాయి చంద్ తదితరులు ఉన్నారు.