స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన ఆదాయం ఇప్పుడు ఒక్క నెలలోనే వచ్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖ ఏటికేడు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేపట్టిన సంస్కరణలు, అమలు చేస్తున్న పథకాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువలు అమాంతం పెరిగాయి. ప్రజల ఆదాయం పెరిగి భూ లావాదేవీలు అనూహ్యంగా పుంజుకొన్నాయి. ఫలితంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూ లావాదేవీల ద్వారా భారీగా ఆదాయం వస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గత రికార్డులను తుడిచిపెడుతూ ఏకంగా రూ.14,291 కోట్ల ఆదాయం వచ్చింది. తొలిసారిగా 14 వేల కోట్ల మార్క్ను దాటింది. ఏకంగా 19.44 లక్షల డాక్యుమెంట్లు నమోదయ్యాయి. గత ఆర్థిక సం వత్సరంలో రూ.15,600 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా.. దీనిని నిజం చేస్తూ లక్ష్యంలో 92 శాతాన్ని చేరుకొన్నది.
రాబడి ఫుల్
2014-15లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం రూ.2,175 కోట్లు మాత్రమే. ఈ ఏడాదితో పోల్చితే తొమ్మిదేండ్లలో ఏకంగా ఆదాయం 557 శాతం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అప్పుడు సుమారు 9 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా ఇప్పుడు 20 లక్షలకు చేరువ కావడం విశేషం. 2021-22తో పోల్చినా.. రూ.1,916 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. 2021-22లో రూ.12,372 కోట్ల ఆదాయం వచ్చింది.
పంచతంత్రం..అనుకున్న ఫలితం
కొవిడ్ లాక్డౌన్, ఇతర భయాలతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భూ లావాదేవీలు భారీగా పడిపోయాయి. దీంతో ఆ ఏడాది రాష్ట్ర ఖజానాకు కేవలం రూ.5,243 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. కానీ మరుసటి ఏడాది గోడకు కొట్టిన బంతిలా రికార్డు స్థాయిలో రెట్టింపునకుపైగా ఆదాయం సమకూరింది. 2021-22లో ఏకంగా రూ.12,372 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో భూ లావాదేవీలు పెరిగేందుకు సీఎం కేసీఆర్ విజన్, ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘పంచతంత్రం’ కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
పాలనా సంస్కరణలు: కొత్త జిల్లాలు ఏర్పాటుతో కొత్త రియల్ కేంద్రాలు ఏర్పడగా, టీఎస్ ఐపాస్తో పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయి. టీఎస్బీపాస్తో ఇండ్ల నిర్మాణ అనుమతులు సులభమయ్యాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. దేశానికే ‘రియల్’ కేంద్రంగా మారింది.
ప్రాజెక్టులు: ఒకప్పుడు నీళ్లు లేక.. పంటలు పండక తెలంగాణ భూములకు ధర పలికేది కాదు. కాళేశ్వరంవంటి ప్రాజెక్టులు రికార్డు సమయంలో పూర్తిచేసి భూగర్భజలాలు పెరుగడంతో ఇప్పుడు బంగారంలాంటి పంటలు పండుతున్నాయి. దీంతో భూమిపై పెట్టుబడి పెట్టేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.
పథకాలు: మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరణకు నోచుకొన్నాయి. ఊళ్లకు కొత్త కళ వచ్చింది. మండుటెండల్లోనూ నిండా నీళ్లతో చెరువులు అటు అన్నదాతలకు, ఇటు కొనుగోలుదారులకు భరోసా ఇస్తున్నాయి.
వ్యవసాయ పథకాలు: నిరంతర విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమావంటి పథకాల అమలుతో తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. ప్రభుత్వమే పంట కొనుగోళ్లు చేపడుతుండటంతో రందిలేకుండా పోయింది. అంతిమంగా తెలంగాణలో భూమి కొనుగోలు చేస్తే చాలు.. మన పంట పండినట్టే అనే భావన అందరిలోనూ పెరిగింది.
ధరణి పోర్టల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కొత్త విప్లవాన్ని సృష్టించింది. వ్యవసాయ భూమి కొనుగోలును అత్యంత సులభతరం చేయడంతోపాటు తెలంగాణలో భూమి కొంటే ఎన్నేండ్లయినా జాగ్రత్తగా ఉంటుందనే భరోసా కల్పించింది. దీంతో భూ యజమానులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గుండెలమీద చేయి వేసుకొని నిద్రపోతున్నారు.
ప్రజల్లో నమ్మకం పెరిగింది
రాష్ట్రంలో భూమి కొనుగోలు చేస్తే కచ్చితంగా రూపాయికి రెట్టింపు లాభం వస్తుందని ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీంతో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత భూమి కొనుగోలు చేస్తే ఆ రికార్డులు భద్రంగా ఉంటాయనే భావన పెరిగింది. రెవెన్యూ సిబ్బంది రిజిస్ట్రేషన్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారు. అవసరమున్న వారికి ఇంటికెళ్లి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒకప్పుడు నీళ్లు లేక రైతుకు ఎంత భూమి ఉన్నా పడావు పడి ఉండేది. అగ్గువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు భూగర్భజలాలు పెరగడం, రైతుబంధు, రైతు బీమావంటి పథకాల వల్ల భూములు బంగారంగా మారాయి. అర ఎకరమైనా తమ పేరుమీద ఉండాలని అనేక మంది కోరుకుంటున్నారు.
– వంగ రవీందర్రెడ్డి, ఎమ్మార్వో, ట్రెసా అధ్యక్షుడు