మంగళవారం ఒక్కరోజే 14,160 మెగావాట్లు నమోదు
అత్యధిక విద్యుత్తు వినియోగంలో
దక్షిణాదిలో రెండో స్థానంలో తెలంగాణ
డిమాండ్ పెరగొచ్చంటున్న అధికారులు
హైదరాబాద్, మార్చి 29 : ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటల సమయంలో 14,160 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. యాసంగి పంటలు కీలక దశకు చేరటం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహ వినియోగం పెరగటం, తాగు, సాగునీటి కోసం ఎత్తిపోతల మోటర్లు నడుస్తుండటంతో భారీగా డిమాండ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ నెల 26న 13,742 మెగావాట్ల రికార్డు విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. 2021 మార్చి 26న నమోదైన 13,688 మెగావాట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి నుంచి విద్యు త్తు డిమాండ్లో రోజూ కొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల్లోనే మూడు సార్లు రికార్డు బ్రేక్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 13,162 మెగావాట్లు మాత్రమే. ఈ రికార్డును గతేడాదే తెలంగాణ దాటేసింది. మంగళవారం నమోదైన డిమాండ్తో దక్షిణ భారతంలోనే అత్యధిక విద్యుత్తు వినియోగం ఉన్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు ఉన్నది.
డిమాండ్ పెరిగినా సమస్య లేదు: ప్రభాకర్రావు
రాష్ట్రం విద్యుత్తు డిమాండ్ ఇంకా పెరిగినా సరఫరాలో ఎలాంటి సమస్య ఉండదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. రాష్ట్రంలో 17,500 మెగావాట్ల వరకు విద్యుత్తు వ్యవస్థలను బలోపేతం చేశామని చెప్పారు.