చిక్కడపల్లి, అక్టోబర్ 14: దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలుస్తామని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (టీఎంపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేశ్ మాదిగ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకొంటామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వెంకటేశ్ మాదిగ మాట్లాడారు.
సీఎం కేసీఆర్ దళితుల దారిద్య్రాన్ని పారదోలి, సమాజంలో తలెత్తుకొని జీవించాలనే గొప్ప ఆలోచనతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో టీఎంపీఎస్ రాష్ట్ర కన్వీనర్ సిగమ్ముల మనోహర్, రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ రోషిని విజయలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర రాంచందర్, మీడియా కన్వీనర్ మాదిరే నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మలగూడెం మాచగిరి, తలారి నారాయణ, కొల్లాపూర్ లక్ష్మయ్య, కృష్ణ, ఐత సాంబయ్య, సధిరపు సాయిలు, ఎర్రోళ్ల వెంటేశ్, ఎర్రోళ్ల తులసిరాం, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.