హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించి జీవధారలా నిలవనున్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను ఎందుకు పరిశీలించరని కేంద్ర జల్శక్తిశాఖను తెలంగాణ నిలదీసింది. ట్రిబ్యునల్ అవార్డును ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ మంగళవారం లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలించలేమని చెప్తూ డీపీఆర్ను సీడబ్ల్యూసీ ఇటీవల వెనక్కి పంపడాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయవివాదాలు ఉన్న ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ తెలపడాన్ని ఖండించింది. కర్ణాటక చేపట్టిన అప్పర్భద్ర ప్రాజెక్టుపై అనేక వివాదాలు ఉన్నాయని, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నదని, అయినా అనుమతులు ఇవ్వటంతోపాటు ఏకంగా జాతీయహోదానే కట్టబెట్టారని గుర్తుచేసింది. ఆ ప్రాజెక్టుకు ఇచ్చిన తరహాలోనే పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టుకు కూడా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అదీగాక 2014లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేసింది.