ఐనవోలు, మార్చి 31: తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో నందనం సొసైటీ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులందరికీ నీళ్లు, కరెంటు ఇచ్చినం, వారు వరి తప్ప ఏ పంట పండిస్తారని సీఎం కేసీఆర్ బాధపడుతున్నారని చెప్పారు.
‘తెలంగాణలో నీళ్లు, కరెంటు ఉన్నాయి. వరి పంట బాగా పడుతుంది. అందుకే కేంద్రం ఓర్వలేక యాసంగి పంటను కొనబోం అని తెగేసి చెప్తున్నది’ అని మండిపడ్డారు. యాసంగి పంట కొనేదాకా పోరాటం చేస్తానని సీఎం కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని మంత్రి వెల్లడించారు. రైతులంతా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం ఉచితంగా ఇస్తున్న కరెంటుకు కేంద్రం మీటర్లు బిగిస్తామంటున్నదని, కానీ పానం పోయినా ఒక్క మోటరుకు కూడా మీటర్ బిగించకుండా చేస్తానని కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
పంజాబ్ తరహాలో కొనాల్సిందే: ఇంద్రకరణ్
నిర్మల్ అర్బన్, మార్చి 31: పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలులో కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యాన్ని కేంద్రం కొనేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
రైతు కన్నెర్ర చేస్తే కేంద్రం కూలాల్సిందే: కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, మార్చి 31: రైతన్న కన్నెర్ర జేస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పరిషత్తు కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరై, ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, ఆయన నేతృత్వంలో రాష్ట్ర రైతు రాజుగా ఎదుగుతుంటే కేంద్రం ఇలాంటి కొర్రీలు పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రైతులకు మద్దతుగా ధాన్యం కొనుగోళ్లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతులను ఢిల్లీలోని ప్రధాని మోదీ అధికార కార్యాలయానికి పంపుతామని కొప్పుల తెలిపారు.
ఉగాది తర్వాత యాక్షన్ ప్లాన్: మల్లారెడ్డి
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారని అన్నారు. తెలంగాణలో పండించిన ప్రతి వడ్ల గింజను పంజాబ్ తరహాలో కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే ఉగాది తర్వాత యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా చేసిన తీర్మానాలను ప్రధాని మోదీ, మంత్రి గోయల్ అధికార నివాసాలకు పంపించినట్టు వెల్లడించారు.