వడ్లు కొనేవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం
అసమర్థ కేంద్ర ప్రభుత్వానికి రైతులే ఉరేస్తారు
వచ్చే నెల 1 వరకు మోదీకి సమయం ఇస్తున్నాం
రాష్ట్ర పోరాటాన్ని మించిన మహోద్యమం
ప్రత్యామ్నాయం లేనివాళ్లు ఎందుకు పాలిస్తున్నరు?
పీయూష్ గోయల్ మా రైతులకు క్షమాపణ చెప్పు
విర్రవీగినవాళ్లు కాలగర్భంలో కలువడం ఖాయం
కేంద్రం ఇబ్బందిపెడితే కిషన్రెడ్డి ఏంచేస్తున్నట్టు?
సచ్చేదాకా మంత్రిగా ఉంటాననే భ్రమలు వద్దు
మండిపడ్డ వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి
కేంద్రం వాదన తప్పని కిషన్రెడ్డి మాట్లాడలేరా?
ఆయన తెలంగాణ బిడ్డ కాదా?: మంత్రి గంగుల
పీయూష్ గోయల్ వ్యాపారివా.. కేంద్రమంత్రివా?
దురహంకారీ.. మా ప్రజలకు క్షమాపణ చెప్పితీరాలి
బండి.. నీ ఒంట్లో ఉన్నది తెలంగాణ నెత్తురేనా?
మగాడివైతే ధాన్యం కొనిపించు: మంత్రి వేముల
ఉగాది తర్వాత నూక ఎవరో.. పొట్టు ఎవరో తెలుస్తది
కేంద్రం దిగొచ్చేదాకా భారీ ఉద్యమం: మంత్రి పువ్వాడ
హైదరాబాద్, మార్చి 26 : కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భరిస్తామని, ప్రజలను అంటే ఊరుకునే ప్రసక్తేలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మగాడే అయితే కేంద్రంతో వడ్లు కొనిపించాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం తెలంగాణభవన్లో మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వానికి వ్యవసాయ విధానం లేదని, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశమే లేదని అన్నారు. వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసినప్పుడు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. తమకు తిరుగులేదని విర్రవీగిన ఎంతోమంది నాయకులు, ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తుచేశారు. రాష్ట్ర రైతాంగాన్ని అవమానించిన పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి రాజకీయ ఆధిపత్యమే తప్ప ప్రజల కష్టాలు పట్టవని మండిపడ్డారు.
వడ్ల కొనుగోలులో కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేస్తూ గందరగోళానికి గురిచేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అసమర్థ, అవగాహనారాహిత్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా కేంద్రం మెదడుకు తాళం వేసుకొన్నదని ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయం ఆలోచించని వాళ్లు కేంద్రాన్ని ఎందుకు నడుపుతున్నారని నిలదీశారు. యూపీఏ ప్రభుత్వం విఫలమైందని అధికారంలోకి రాకముందు మోదీ చెప్తే, దేశాన్ని ఉద్ధరిస్తారని భావించామని.. అంతకన్నా దారుణంగా మార్చారని ఆరోపించారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కార్యాచరణ ప్రారంభమైందని, వచ్చేనెల 1 వరకు గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్లతోపాటు వివిధస్థాయిల్లో తీర్మానాలు చేసి ప్రధానికి పంపిస్తామని తెలిపారు. అప్పటికీ కేంద్రం దిగొచ్చి వడ్లు కొనకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మించిన మహోద్యమం నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. తెలంగాణను అవమానించిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారన్న సంగతిని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేంద్రం కొనకపోతే తామే వడ్లు కొంటామని చెప్పిన వాళ్లు ఎక్కడపోయారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులను కేంద్రం ఇంతగా ఇబ్బందిపెడుతున్నా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. సచ్చేదాకా కేంద్రమంత్రిగా ఉంటాననే భ్రమలు వీడాలని కిషన్రెడ్డికి హితవు పలికారు.
కిషన్రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా: మంత్రి గంగుల
ఐదుసార్లు రాష్ట్ర మంత్రుల బృందం కలిసినా కేంద్రానికి చీమకుట్టినట్టయినా లేదని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. పీయూష్ గోయల్ను కలిసిన ప్రతిసారీ అవహేళన చేస్తూ మాట్లాడారని, వ్యక్తిగతంగా అవమానాలకు గురిచేసినా తెలంగాణ రైతాంగం కోసం అన్నింటినీ భరించామని చెప్పారు. కేంద్రం వాదన తప్పు అని కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని, ఆయన తెలంగాణ బిడ్డ కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణపై అసత్యాలు ప్రచారం చేయడం, అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఎఫ్సీఐ ఫిబ్రవరి 25, మార్చి 8న నిర్వహించిన సమావేశానికి తెలంగాణ హాజరు కాలేదనడం పచ్చి అబద్ధమని చెప్పారు. ఆ సమావేశాల మినిట్స్ను పీయూష్ గోయల్ చూపించారంటూ ఆ కాపీలను గంగుల ప్రదర్శించారు. గత యాసంగి సీజన్ సేకరణ ముగింపు దశలో ఇచ్చిన టార్గెట్ను పునఃసమీక్షిస్తూ కేవలం రా రైస్ మాత్రమే ఇవ్వాలని కోరితే, రూ.12 వేల కోట్లకుపైగా విలువైన పంటను సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చాక.. కేంద్ర ప్రభుత్వం చెల్లించబోమంటే ఆ నష్టాన్ని తెలంగాణ ఎలా భరిస్తుందని ప్రశ్నించారు. గత యాసంగిలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇంకా తీసుకోలేదని, ప్రతి నెలా 10 లక్షల టన్నుల బియ్యం ఇస్తామని చెప్పినా ర్యాక్స్ ఖాళీ లేవంటూ 3 లక్షల టన్నులే తీసుకొన్నదని వివరించారు. ఈ విషయంలో కేంద్రానికి 16 లేఖలు రాశామని, వాస్తవాలు వక్రీకరించేలా తెలంగాణను బద్నాం చేయటం తెలంగాణ బిడ్డగా కిషన్రెడ్డికి ఎంత వరకు సమంజసమని నిలదీశారు.
ఉద్యమాలు కొత్తకాదు: మంత్రి పువ్వాడ
ఉగాది తరువాత రాష్ట్రం ఉగ్ర తెలంగాణగా మారుతుందని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. రైతులను అవమానాలకు గురిచేసిన కేంద్రం దిగొచ్చేదాకా భారీ ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టంచేశారు. ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదని, ఉగాది వరకు కేంద్రానికి సమయం ఇస్తున్నామని చెప్పారు. ఈలోపు ప్రధాని స్పందించకుంటే ఉగ్ర తెలంగాణను దేశం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉగాది తరువాత నూక ఎవరవుతారో..పొట్టు ఎవరవుతారో తేలుస్తుందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తన సికింద్రాబాద్ నియోజకవర్గంలో రైతులు వడ్లు పండించనందున సమస్య ఉండదని భావిస్తున్నట్టు ఉన్నారని, అక్కడి ప్రజలకు నూకలు తినిపిస్తే ప్రజాగ్రహం ఏమిటో తెలుస్తుందని హెచ్చరించారు.
పీయూష్ వ్యాపారివా?కేంద్రమంత్రివా?: మంత్రి వేముల
పీయూష్గోయల్ కేంద్రమంత్రి హోదాకు తగ్గట్టుగా కాకుండా ప్రైవేట్ వ్యాపారిలా మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శిం చారు. పీయూష్ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని చెప్పారు. బాయిల్డ్ రైస్ కేంద్రం కొనబోదని, కావాలంటే రాష్ట్రమే కొనాలని.. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించటం అలవాటు చేయాలని హేళన చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. హేళన చేసిన ఆయన ఇంతకింత అనుభవిస్తారని హెచ్చరించారు. దురహంకారి పీయూష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం మోసాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ వరి వేయద్దని చెప్తే, బండి సంజయ్ కేంద్రం కొనకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తానే బాధ్యత తీసుకొని కొనిపిస్తానన్న వీడియోను వేముల ప్రదర్శించారు. బండి సంజయ్కి ఒంట్లో నెత్తురుంటే.. మగాడే అయితే కేంద్రంతో ధాన్యాన్ని కొనిపించాలని సవాల్ విసిరారు. సమావేశానికి రావాలని స్వయంగా పీయూష్గోయలే కిషన్రెడ్డిని ఆహ్వానిస్తే తప్పించుకొని.. తమను రాష్ట్ర ప్రభుత్వం పిలువలేదనటం దారుణమని అన్నారు. ఎప్పటికైనా ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టంచేశారు. బీజేపీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వంతపాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలది ఒకే విధానమని దుయ్యబట్టారు.
నూకలు తీనే పరిస్థితి లేదు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నూకల అన్నం తీనే పరిస్థితి ఉందో ఏమోగానీ, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. రైతులను రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారు. యాసంగి వడ్లను కొనకపోతే బీజేపీ నాయకులకు రైతులు, ప్రజలే బుద్ధి చెప్తారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న గోయల్ రైతులను అపహాస్యం చేసేలా మాట్లాడం ఎంతవరకు సమంజసం. బీజేపీకి బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. వడ్లు కొనుగోలు చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతాం. చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను గమనిస్తున్నారు. – చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
ప్రతి గింజనూ కొనాల్సిందే..
తెలంగాణలో పండిన ప్రతి వడ్లగింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆహార భద్రతా చట్టం ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. వెనక్కి తగ్గితే ఉద్యమాలు తప్పవు. రైతులకు వ్యతిరేకంగా, పెట్టుబడి దారులకు ప్రతినిధిగా గోయల్ వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాటాలు చేస్తాం. రైతులు కన్నెర్ర జేసిన రాజ్యం నిలిచినట్టు చరిత్రలో లేదు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి టన్నుకు రూ.300 నష్టం వస్తున్నా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వమే భరిస్తున్నది. దేశంలో అన్ని రకాల పంటలు పండుతాయి. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే 80 శాతం నూనెలు దేశానికి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. – జగదీశ్రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి
పీయూష్ మాటలు దారుణం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను, ఆహారపు అలవాట్లను కించపరిచేలా మాట్లాడటం చాలా దారుణం. పీయూష్ వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేయకుండా తప్పించుకొంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర మంత్రులు ధర్నాలు చేపట్టడం మంచి విషయం. ధాన్యం కొనుగోలు చేయడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ బాధ్యతే. తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయమైన డిమాండ్ను పట్టించుకోకుండా గోయల్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడటం చాలా సంతోషకరం. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
మా ధాన్యం ఎందుకు కొనరు?
పంజాబ్లో మొదటి పంట వడ్లు, రెండో పంట గోధుమను కొంటున్న కేంద్రం, తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు తీసుకోదో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. బియ్యం రూపంలో ఇవ్వాలని కేంద్రం మెలికలు పెట్టడం ఏమిటి? కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలి. కేంద్రం వడ్లు కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదు. ఉగాది తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రైతులు తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగరవేయాలి.
– ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి