MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని కోరింది. ఈ మేరకు సోమవారం నాడు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పోరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు.
ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను తెలంగాణ జాగృతి మహిళా విభాగం కోరింది. ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండటమే కాకుండా ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారని పేర్కొంది. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగొని శోభ గౌడ్, బండారి లావణ్య, స్వప్న రెడ్డి, సింగిరెడ్డి విమల రెడ్డి, శ్రీలత, మహేశ్వరి, రత్న, పెంటమ్మ, తదితరులు ఉన్నారు.