హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బూస్టర్డోస్(ప్రికాషన్డోస్) పంపిణీలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్యశాఖ ప్రణాళికాబద్దంగా వ్యవహరించడంతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలో అన్ని వయసుల వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ 100% పూర్తికాగా, మూడో డోస్ 48% మంది తీసుకొన్నారు. రాష్ట్రంలోని 60 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో సుమారు 65% మంది, 18-59 ఏండ్ల వయసువారిలో 45% మంది బూస్టర్డోస్ వేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బూస్టర్ డోస్ పంపిణీలో తెలంగాణ కంటే బీజేపీ రాష్ర్టాలు వెనుకబడి ఉండటం గమనార్హం. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు ఏ వయసు వర్గం వారికి కూడా టీకాల పంపిణీ 100% పూర్తి కాలేదు.
బీఎఫ్-7, బీఏ-5, ఎక్స్బీబీ వేరియంట్లపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్కువ సంఖ్యలో టీకాలు సరఫరా చేయాలని మంత్రి హరీశ్రావు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, కార్బొవాక్స్ నిల్వలు అసలే లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకున్నందున రోగనిరోధక శక్తి పెరిగిందని, కొత్త వేరియంట్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే చాలని సూచిస్తున్నారు.
బూస్టర్ డోస్ తీసుకోవడం అవసరం: మంత్రి హరీశ్రావు
కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహనా కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ అందులో దాగి ఉన్నాయని ట్వీట్ చేశారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. చైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒకరూ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. రాష్ర్టాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, త్వరలో అవసరమైనన్ని డోసులు పంపిణీ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.