హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. కరోనా సమయంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థిక సహాయంతో ఆదుకున్నామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తన శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్ నిధిని సీఎం కేసీఆర్ కేటాయించారని, దీని ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో మీడియా భవన్ నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఆ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. హెల్త్ కార్డుల ద్వారా జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని వివరించారు. 479 జర్నలిస్టు కుటుంబాలకు రూ.6.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశామని తెలిపారు. 136 మందికి ఆర్థిక సాయంగా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ.68 లక్షలు అందించినట్టు వివరించారు.
వారి సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.19 కోట్ల నిధులను కేటాయించిందని చెప్పారు. పిల్లల చదువుల కోసం నెలకు రూ.1,000 చొప్పున రూ.74.37 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. 7,460 మంది జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి, వారిలో వృత్తి నైపుణ్యం పెంచామని వివరించారు. రాష్ట్రంలో అందుబాటు లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్రెస్క్లబ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో సమాచార శాఖ పాత్రను పెంచాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయ పడ్డారు. శాఖలో క్షేత్ర స్థాయిలో ఖాళీగా ఉన్న 361 వివిధ పోస్టులను త్వరలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని, ప్రచార కార్యక్రమాలను విసృ్తతంగా చేపట్టేందుకు అధికారులకు, సిబ్బందికి అవసరమైన కొత్త కెమెరాలు, వాహనాలు మంజూరు చేసేందుకు ఆదేశాలిస్తామని వెల్లడించారు. సమీక్షలో సమాచార శాఖ కమిషనర్ అశోక్రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.