మోర్తాడ్/ఏర్గట్ల, సెప్టెంబర్ 7 : ‘కాంగ్రెసోళ్లు రూ.4 వేల పింఛన్ ఇస్తామని తిరుగుతుండ్రు. మరి మొన్ననే కర్ణాటకలో కాంగ్రెసోళ్లు గెలిచిండ్రు. మరి అక్కడ ఇస్తున్నది రూ.750 మాత్రమే కదా’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మరి తెలంగాణలో రూ.4 వేలు ఎట్లిస్తరో ఆలోచన చేయాలని సూచించారు. తమకంటే ముందు పాలించిన కాంగ్రెసోళ్లు రూ.200 పింఛనే ఇచ్చారని, అదికూడా తక్కువ మందికే అందేదని చెప్పారు. తెలంగాణ వచ్చినంక పింఛన్ రెండువేలు ఇస్తున్నామని, అప్పటి కన్నా ఎక్కువ మందికి అందుతున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లోని రైతువేదికలో తిమ్మాపూర్కు చెందిన 85 మంది, పాలెం గ్రామానికి చెందిన 95 మందికి, ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో తడ్పాకల్కు చెందిన 31 మంది, తాళ్లరాంపూర్కు చెందిన 22 మందికి గురువారం ఆయన ఇండ్లస్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏమన్న జెప్పుదం ఓట్లేపిచ్చుకుందం ఆ తరువాత చూద్దం అన్నట్టుగా కాంగ్రెసోళ్లు వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధరల పెరుగుదలకు బీజేపీ కారణమని ఆయన ఆరోపించారు. బీజేపీ రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1,000 అయ్యిందని, డీజీల్, పెట్రోల్ ధరలు రెండింతలు అయ్యాయని, వీటి పెరుగుదల కారణంగా ఇంట్లో వాడే ప్రతి వస్తువు ధర రెండింతలైందని అన్నారు. ‘మీ ఊర్లు నేను రాకముందు ఎట్లుండె? ఇప్పుడు ఎట్లున్నయి. మీరు ఆలోచన చేయాలి. నన్ను మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసుకుందాం, ఎవరెన్ని మాయమాటలు చెప్పిన, కట్టుకథలు చెప్పిన కండ్లకు కనిపిస్తున్నదాన్నే నమ్ముండ్రి, అభివృద్ధి కోసం ఆశీర్వదించి’ అని ఆయన కోరారు.