కామారెడ్డి : సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందుందని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, భీమ, రాయితీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతులు దృష్టిని సారించాలని పేర్కొన్నారు.
పార్టీలకతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తోందని వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని గుర్తు చేశారు. అంతకుముందు శాసనసభాపతి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, వెంకటేష్ ధోత్రే, ఆర్టీవో వాణి, ఆర్ డి ఓ శ్రీను, వివిధ అ శాఖల అధికారులు పాల్గొన్నారు.