ఎనిమిదేండ్లలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదుగుదల
ప్రపంచమంతటా విస్తరించిన రాష్ట్ర గౌరవం
పెట్టుబడిదారులకు వేధింపులు, అవినీతి లేవు
సంపద, ఉద్యోగ సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలే
రిపీట్ పెట్టుబడులే రాష్ట్ర పనితీరుకు నిదర్శనం
ఎఫ్టీసీసీఐ సదస్సులో మంత్రి కేటీఆర్ వెల్లడి
ఉత్తమ పరిశ్రమలకు ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానం
నేడు దేశంలోనే 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారు. రాష్ట్రంలో గత ఎనిమిదేండ్లుగా పరిశ్రమలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్ పడిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నాం.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ర్టాల సరసన నిలిచే స్థాయికి తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ర్టాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పంలో భాగంగా తీసుకొచ్చిన విధానాల వల్ల నేడు పారిశ్రామిక రంగం శరవేగంగా దూసుకుపోతున్నదని చెప్పారు. ఇంకా మెరుగైన విధానాలను సూచిస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పరిశ్రమలకు సోమవారం హెచ్ఐసీసీలో ఎక్స్లెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో అగ్రశ్రేణి రాష్ర్టాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు మాత్రమే ఉండగా, నేడు వాటి వరుసలో తెలంగాణ కూడా చేరిందని చెప్పారు. నేడు తెలంగాణ గౌరవం మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా వ్యాపించిందని అన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారని తెలిపారు.
భిన్నత్వానికి కేంద్రమైన మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులు ఉన్నాయని, పెట్టుబడిదారులు ముందుగా అన్నీ అధ్యయనం చేసిన తరువాతే రాష్ర్టాన్ని ఎంచుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ఐపాస్ చట్టం ద్వారా 15రోజుల్లో పరిశ్రమలకు డీమ్డ్ టూ బి అప్రూవల్ విధానాన్ని అమలుచేస్తున్నామని, సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం సైతం ఎక్కడా లేదని చెప్పారు. పెట్టుబడిదారులకు వేధింపులు, అవినీతికి ఆస్కారంలేకుండా స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించామని అన్నారు. దేశంలో పెట్టుబడిదారులకు గౌరవంలేదని, ముఖ్యంగా ఎవరైనా విజయాలు సాధిస్తే దానివెనుక ఏదో మతలబు ఉందని భావిస్తారని, తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదని చెప్పారు. పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలే కాకుండా ఉద్యోగాల సృష్టికర్తలు కూడా అని కొనియాడారు. ప్రభుత్వాలకు సాధ్యంకానన్ని ఉద్యోగాలను పెట్టుబడిదారులు కల్పిస్తున్నారని అన్నారు.
ఈఓడీబీలో వరుసగా మనదే అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం ఒక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లోనే కాకుండా అనేక రంగాల్లో ముందంజలో ఉన్నదని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ప్రవేశపెట్టినప్పటినుంచి తెలంగాణ ఒక్కసారి మినహా ఎప్పుడూ ప్రథమస్థానంలోనే ఉన్నదని, ఈసారి కూడా ప్రథమ స్థానంలో నిలిచినప్పటికీ కేంద్రానికి తెలంగాణకు ప్రథమస్థానం ఇవ్వడం ఇష్టంలేక మూడు-నాలుగు రాష్ర్టాలను జోడించి ప్రథమ స్థానం కేటాయించారని తెలిపారు. నేడు దేశంలోనే 24గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. కర్ణాటకలో ఒక పరిశ్రమ అగ్నికి ఆహుతై దాదాపు రూ. 300కోట్ల నష్టం జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్రంలో గడచిన ఎనిమిదేండ్లుగా పరిశ్రమలు ప్రశాంతంగా నడుస్తున్నాయని, ఒక్క పరిశ్రమ సైతం లాకౌట్ పడిన దాఖలాలులేవని చెప్పారు. క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎంతో ప్రధానమని, రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు చార్జీలు సహా వివిధ రకాల పన్నుల విషయంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకన్నా మెరుగైన విధానాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎఫ్టీసీసీఐ దీనిపై తగిన సూచనలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యాపారులు, పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారనేందుకు 24శాతం రిపీట్ పెట్టుబడులు ఉండటమే నిదర్శనమని చెప్పారు. పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం కాకుండా.. ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం పారిశ్రామిక వాడలను ప్రోత్సహిస్తున్నామని, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర పట్టణాల్లో ఐటీ టవర్లు ఏర్పాటుచేయగా, అనేక ప్రఖ్యాతిగాంచిన సంస్థలు కొలువుదీరాయని చెప్పారు.
రాష్ట్రంలో త్వరలో ఐదు విప్లవాలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ నీటితో వివిధ ప్రాంతాల్లో మొత్తం 164 టీఎంసీల సామర్థ్యంగల జలాశయాలను నిర్మిస్తున్నామని, దీంతో వ్యవసాయంతోపాటు మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజక్టులు కూడా త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. రానున్న రోజుల్లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, డెయిరీ పరిశ్రమ, మాంసం ఉత్పత్తులు, వంట నూనెల ఉత్పత్తి తదితర రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందనున్నాయని, ఇందులో భాగంగా హరిత, నీలి, శ్వేత, పింక్, ఎల్లో విప్లవాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 10వేల ఎకరాలు సమీకరించామని, వీటిల్లో ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లను నెలకొల్పుతామని చెప్పారు. కొవిడ్ సందర్భంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా పారిశ్రామికరంగానికి తెలంగాణ సహకరించిందని, ఈ విషయం ఢిల్లీ, ముంబైలోని పారిశ్రామికవేత్తలే చెబుతున్నారని కేటీఆర్ వివరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్తోపాటు ఎఫ్టీసీసీఐకి చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.