రాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలంగాణ): నవభారత జాతి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం చోదక శక్తిగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. అన్ని రంగాల్లో నవీన ఆవిష్కరణలు, నూతన విధానాలతో ముందుకు పోతున్నదని తెలిపారు. దేశానికి బువ్వ పెడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణది నాలుగో స్థానమని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి సాధించడం వల్లే గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం కేటీఆర్ పర్యటించారు. పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు రూ.2 లక్షల విలువైన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించి, ఏరియా దవాఖానలో చిన్నపిల్లల వార్డు, కంటి ఆపరేషన్ విభాగాలను ప్రారంభించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం విడుదల చేస్తున్న అన్ని నివేదికల్లో తెలంగాణ రాష్ట్రమే అగ్రగామిగా ఉన్నా, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, 10 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించడం ఏంటని నిలదీశారు.
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి 5 ఏండ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రెండో దఫాలో 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 134 స్టడీ సర్కిళ్లను సీఎం కేసీఆర్ మం జూరు చేశారని, సిరిసిల్లలో బీసీ స్టడీ సర్కిల్ శాశ్వత భవనాన్ని సంవత్సరంలోగా నిర్మిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. కాగా వర్షాకాలం ముగిసే వరకు వైద్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులంతా అలర్ట్గా ఉండాలన్నారు.
బూస్టర్ డోసులు వేయడంలో వేగం పెంచాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకా బూ స్టర్ డోసులు వేయటంలో వేగం పెంచాలని మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అందుకు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని కోరారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించాలని ఆదేశించారు. బాధితులకు వీలైనంత త్వరగా చికిత్స అందించాలని కోరారు. మున్సిపాల్టీల పరిధిలోని రోడ్లు, మురు గు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ము న్సిపల్ అధికారులకు సూచించారు. సిరిసిల్ల పట్టణంలో 37 రకాల పనుల కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన శాఖను సిరిసిల్లలో తర్వలో ప్రారంభిస్తామని చెప్పారు. ఏరియా దవాఖానకు మరోసారి కాయకల్ప అవార్డు రావడంపై వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయం తి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి పాల్గొన్నారు.
ప్రగతిలో బెస్ట్
రాష్ట్రం వచ్చిన కొత్తలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000 ఉంటే, ప్రస్తుతం 130 శాతం పెరిగి రూ.2,78,000కి చేరిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. జీఎస్డీపీ 2014లో రూ.5,60,000 కోట్లు ఉంటే, 125 శాతం పెరిగి ప్రస్తుతం రూ.11,55,000 కోట్లకు చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ తలసరి ఆదాయం రూ.1,49,000 మాత్రమేనని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో బెస్ట్ పర్మార్మెన్స్ స్టేట్గా తెలంగాణ నంబర్ వన్ ర్యాంకు సంపాదించటం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలోని 20 అత్యుత్తమ గ్రామ పంచాయతీల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించిందని వెల్లడించారు. పట్టణ అభివృద్ధిలో సైతం 12 జాతీయ అవార్డులను దక్కించుకున్న ఘనత తెలంగాణకే దక్కిందని పేర్కొన్నారు.