న్యూఢిల్లీ, జూలై 10: ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాలు మదుపర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతకుముందు నెలతో పోల్చితే గత నెలలో 26 శాతం వృద్ధి చెందాయి. ఈ ఏడాది జూన్లో రూ.28,973 కోట్ల పెట్టుబడులు ఈ స్కీముల్లోకి వచ్చాయని శుక్రవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) వెల్లడించింది. మే నెలలో రూ.22,908 కోట్లు వచ్చినట్టు తెలిపింది. ఈ ఏడాది కనిష్ఠ స్థాయి ఇదే కావడం గమనార్హం. కాగా, జూన్ పెట్టుబడులతో ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో ఈక్విటీ ఎంఎఫ్లలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.1.81 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో రూ.1.61 లక్షల కోట్లు రాగా, ఈసారి 12 శాతం పెరిగినైట్టెంది. భౌగోళిక-రాజకీయపరంగా నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులు తగ్గుముఖం పట్టడం కసొచ్చిందని యాంఫీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. రిటైల్ మదుపర్లు ఎక్కువగా పెట్టుబడులను పెట్టారని కూడా వివరించింది.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లలోకి జూన్లో వచ్చిన పెట్టుబడులు రూ.31,781 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెల రూ.30,954 కోట్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే గత నెలలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి తరలిపోయిన పెట్టుబడుల విలువ రూ.52,949 కోట్లుగా ఉన్నది. అయితే మే నెలలో రూ.64,131 కోట్లుగా ఉన్నది. ఇక ఇండస్ట్రీ ఆధ్వర్యంలోని ఆస్తులు జూన్ ఆఖరునాటికి రూ.82.22 లక్షల కోట్లుగా ఉన్నాయి. మే నెల చివర్లో రూ.81.60 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లలో పెట్టుబడుల ఉపసంహరణలు జరిగాయి.
అయితే గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లలోకి జూన్లో పెట్టుబడుల ప్రవాహం కనిపించింది. మే నెలలో రూ.725 కోట్ల పెట్టుబడులు వెనుకకుపోయాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో గోల్డ్ ఈటీఎఫ్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.37,319 కోట్లుగా ఉన్నది. గత ఏడాది జనవరి-జూన్లో రూ. 8,021 కోట్లే. ఇక రుణ ఆధారిత పథకాల నుంచి గత నెల రూ.1.09 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. మే నెలలోనూ రూ.96,948 కోట్లు వెనుకకుపోయిన విష యం తెలిసిందే.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, మార్కెట్ ఒడిదుడుకులున్నప్పటికీ మదుపర్లు పెట్టుబడులకే పెద్దపీట వేశారు. ముఖ్యంగా జూన్లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలు ఆకర్షణీయంగా మారడానికి రిటైల్ ఇన్వెస్టర్లే కారణం. వారి నుంచి పెట్టుబడులు పెద్ద ఎత్తున జరిగాయి.
-నేహాల్ మేశ్రమ్, మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్
