Telengana | ‘ప్రత్యేక రాష్ట్రమొస్తే హైదరాబాద్ ఆగమైతది.. కొట్లాటలైతయ్.. ఐటీ ఢమాల్ అయితది.. ఆదాయం పడిపోతద’ని విమర్శించిన వాళ్ల నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. ఐటీ గ్రోత్కు ‘తెలంగాణ మాడల్’గా ఎదిగింది. అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ రెండో అడ్డాగా మారింది. కంపెనీలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త కొలువులు లక్షల్లో పుట్టుకొస్తున్నాయి. ఆదాయమే కాదు ఆనందమూ నాలుగింతలైంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఐటీ కారిడార్లో కలిసిన ఓ ఐదుగురు స్టార్టప్, ఐటీ, సర్వీస్, కంపెనీల నిర్వాహకుల అసలు ముచ్చట చదివేస్తే మీకు తెలుస్తుంది..
విశాల రెడ్డి (ఐడెంటిసిటీ వ్యవస్థాపకురాలు): తెలంగాణ ఏర్పడేనాటికి సమస్యలు చాలా ఉండే! వాటిని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది. తెలంగాణ సాధించడంలో చూపిన పట్టుదలే.. పాలనలో కనబడింది. పాలకులు ఐటీ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ చూపారు.
శ్రీనివాస్ మాధవం (ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు): హా! ఉద్యమ సమయంలో కొంత అస్థిరత ఉన్నమాట వాస్తవమే! రేపు ఎలా ఉంటుందోనని అనుమానంతోనే 2014లో నేను హైదరాబాద్ వచ్చాను. కంపెనీ పెట్టాను. కొద్ది రోజుల్లోనే నా భయాలన్నీ పటాపంచలయ్యాయి. తెలంగాణలో మతకలహాలు లేవు. రాజకీయ ఘర్షణల్లేవ్. కర్ఫ్యూల్లేవ్. కంపెనీలు మంచిగా ఉన్నాయి. నా స్టార్టప్ బిజినెస్ బాగా నడుస్తున్నది.
శ్రీచరణ్ లక్కరాజు (స్టుమాగ్ వ్యవస్థాపకుడు): అవును! బెటర్ లైఫ్ైస్టెల్ ఉన్నచోటికే కంపెనీలు వస్తాయి. ఇక్కడ విద్యావంతులైన ప్రజలు ఉన్నారు. తెలంగాణ ఐటీకి కేటీఆర్ రూపంలో యంగ్ లీడర్షిప్ దొరికింది. అన్ని ప్రాంతాల ప్రజలను నిలుపుకొనేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో హైదరాబాద్ మేజర్ ఐటీ హబ్గా ఎదిగింది.
విశాల: కంపెనీల అధిపతులు టీలు, కాఫీలు ఇస్తే రారు. ఇక్కడ విద్య ఎలా ఉంది? విద్యా నైపుణ్యాలు ఎలా ఉన్నాయ్? క్వాలిటీ పీపుల్ ఉన్నారా? రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ చూసుకుంటారు. కంపెనీలు నెలకొల్పే చోట ఉద్యోగులు ఉండేందుకు అద్దెకు దొరికే ఇండ్లు, నీళ్లు, సోషల్ లైఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ అన్నీ చూస్తారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే సంస్థను నెలకొల్పడానికి ముందుకొస్తారు. మన దగ్గర ఇవన్నీ ఉండబట్టే.. ఆపిల్ నుంచి లులు వరకు ఇన్ని కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. సేఫ్టీలో కూడా చాలామార్పు వచ్చింది. ఒకప్పుడు బస్స్టాపుల్లో నిల్చుంటే నరకం అనుభవించేవాళ్లం. ఆకతాయిలు పొద్దంతా అక్కడే ఉండి అసభ్యంగా బిహేవ్ చేసేవాళ్లు. వాళ్ల వల్గర్ కామెంట్స్ వినాల్సి వచ్చేది. ‘షీ టీమ్స్’ వచ్చాక ఊహించని మార్పు కనిపిస్తున్నది.
శ్రీనివాస్: మరో విషయం, దేశంలో ఐటీకి హైదరాబాద్లో ఉన్నంత అనుకూలత మరే నగరానికి లేదు. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే పెట్టుబడులు వచ్చాయి. రాజకీయ అస్థిరత ఉంటే ఐటీలో ఈ రేంజ్ డెవలప్మెంట్ అయ్యేది కాదు!
చిత్రాలీ శర్మ (వాట్ ఈజ్ మై గోల్ ఫౌండర్): పెద్ద కంపెనీలే కాదు చిన్న చిన్న స్టార్టప్లకు కూడా హైదరాబాద్ బెస్ట్ సిటీ. ఐటీ మినిస్ట్రీ ప్రోత్సాహం బాగుంది. బెంగళూరు, ముంబయి కంటే హైదరాబాదే కంపెనీల స్థాపనకు అనుకూలమైనది.
బసవ నాగదీప్ (ఐటీ ఉద్యోగి): ఒకప్పుడు హైదరాబాద్లో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ట్రాఫిక్ తగ్గించడానికి పదుల సంఖ్యలో ఫ్లై ఓవర్లు వచ్చాయి. రోడ్లు రెండింతలు పెరిగినా ట్రాఫిక్ తగ్గలేదు. కొత్తగా వందల, వేల కంపెనీలు వచ్చాయి మరి! ఉద్యోగులు విపరీతంగా పెరిగారు. మరక మంచిదే అన్నట్టు.. ఉద్యోగులు పెరిగితేనే కదా ట్రాఫిక్ పెరిగేది.
శ్రీనివాస్: హైదరాబాద్ను సీమాంధ్రులు ఓన్ చేసుకున్నారు. ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ఐటీ కారిడార్లో జీవిస్తున్నాం. మాది కడప. అయిదేండ్లు చెన్నైలో పని చేశా. కానీ, హైదరాబాద్ నా సొంతం అనే ఫీలింగ్. నాకు తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ గ్రాంట్ అయిదు లక్షలు ఇచ్చింది. తెలంగాణ వాళ్లు మమ్మల్ని మావాళ్లు అనుకుంటున్నారు. సీమాంధ్రులకు తెలంగాణ వాళ్లు మావాళ్లే!
నాగదీప్: మాది కృష్ణాజిల్లా నూజివీడు. నేను 2011లో హైదరాబాద్ వచ్చాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది. హాస్టల్స్లో తెలంగాణ, ఆంధ్ర చర్చలు రచ్చరచ్చగా సాగేవి. కొంతమంది తెలంగాణ యువకులు చాలా ఉద్వేగంతో మాట్లాడేవాళ్లు. వారి మాటల్లో న్యాయం ఉందనిపించేది. ఎంత ఆవేశంగా మాట్లాడినా.. ఏనాడూ వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యం చేయలేదు. అంతెందుకు నేను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని తెలంగాణ ప్రాంతీయుడే. నా ఉద్యోగానికీ, జీవితానికీ ఏ ఇబ్బందీ లేకుండా హైదరాబాద్ ప్రేమను పంచింది.
శ్రీచరణ్: మాటలు చెప్పినంత తేలిక కాదు.. అభివృద్ధి అంటే! బెంగళూరును బైపాస్ చేసి దూసుకుపోతున్నం. తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బెస్ట్ మాడల్. టీఎస్ ఐపాస్ వల్ల కంపెనీలు పెట్టేవాళ్లకు ఇబ్బందుల్లేకుండా పోయాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మన నగరాన్ని సెకండ్ హబ్గా మార్చుకుంటున్నాయంటే ప్రౌడ్గా ఉంది.
విశాల: ఇన్ఫ్రా డెవలప్ చేసినంత మాత్రాన సరిపోదు. మంచి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) కూడా ఉండాలి. పెట్టుబడులను ఆకర్షించేందుకు మినిస్టర్ కేటీఆర్ అంతర్జాతీయ రోడ్ షోలకు వెళ్తున్నారు. సమావేశాలకు పోతున్నారు. మీకు కావాల్సిన వనరులు మా దగ్గర ఉన్నాయని నమ్మకంగా చెప్పడం వల్లే హైదరాబాద్కు ఇన్ని కంపెనీలు వచ్చాయి. పీఆర్లో తెలంగాణ నంబర్ వన్.
శ్రీచరణ్: ఐటీ రంగం గురించి ఏ పార్టీ మ్యానిఫెస్టోల్లో కనిపించట్లేదు. ఏదో చేస్తామని హామీ ఇవ్వడానికి ఏమీ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్నీ చేసింది. కాబట్టే వేరే వాళ్లకు మాట్లాడే అవకాశమే లేకుండాపోయింది. తెలంగాణలో ఆంధ్రావాళ్లు గతంలోకంటే కంఫర్టబుల్గా ఫీలవుతున్నారు.
శ్రీనివాస్: ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్లేస్లో మరొకరిని ఊహించుకోలేం. ఆయన స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు లేరు. స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో కేటీఆర్ ముద్ర చెరిగిపోదు. ఆయన్నెవరూ రీప్లేస్ చేయలేరు. ఓటుంటే.. డౌటే లేదు. బీఆర్ఎస్కే వేసేవాడిని.
ఇవీ ఐటీ కారిడార్లో వినిపిస్తున్న మాటలు. ఇవి జస్ట్ స్టేట్మెంట్లు కాదు.. పదేండ్ల తెలంగాణలో వాళ్ల అనుభవాలు. ఐటీలో తెలంగాణ తగ్గేదే.. లే అని నిరూపిస్తున్న నిఖార్సైన అభిప్రాయాలు!
…? నాగవర్ధన్ రాయల