BJP | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో పార్టీలు ఏ ని యోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలుపాలి? ఎవ రు సరైన వ్యక్తి? గెలుస్తారా? ఓడుతారా? రా జకీయ సమీకరణాలు ఏమిటి? వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ బీజేపీ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం గా తయారైంది. ఎన్నికల నాటికి 119 నియోజకవర్గాలకు సరిపడా అభ్యర్థులు దొరకడం గగనమైపోయింది. ఇన్నాళ్లూ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చే అసంతృప్తులు బీజేపీలో చేరుతారని, అభ్యర్థులకు కొరత ఉండదని బీజేపీ భావించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓవైపు చేరికలు బంద్కాగా.. మరోవైపు ఎవరెవరు బయటికి వెళ్లిపోతున్నారో తెలియక ఆ పార్టీ రాష్ట్ర నేతలు తలలు పట్టుకొంటున్నారు. కొత్త వాళ్లు రాక, ఉన్నవాళ్లు వెళ్లిపోతే ఎన్నికల నాటికి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమని స్వయంగా బీజేపీ నేతలే చెప్తున్నారు. ఇప్పుడున్న వాళ్లలో కూడా ఎవరు ఉంటారో?.. ఎవరు వెళ్లిపోతారో తెలియడం లేదని అంటున్నారు. విజయశాంతి, వివేక్వంటి సీనియర్ నేతలు పార్టీ కార్యకలాపాలకు చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటివారు నిర్ణయం ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎప్పటి నుంచో లీకులు వస్తున్నాయి. ఎన్నికల నాటికి ఇలాంటివారిలో ఎంత మంది బీజేపీలో కొనసాగుతారో తెలియదని అంటున్నారు. గొప్పలు చెప్పుకొని ఈటల నేతృత్వంలో ‘చేరికల కమిటీ’ వేస్తే ఎందుకూ పనికిరాకుండా పోయిందనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. చేరడం అటుంచి చాలామంది బీజేపీకి రాంరాం చెప్పారని పార్టీ నాయకులు వాపోతున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెద్దు పోకడ వల్లే ఎవరూ రావడం లేదని అనుకున్నామని, అతడిని పదవి నుంచి తొలిగించిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పేర్కొంటున్నారు. కిషన్రెడ్డి హయాంలో ఇప్పటిరకూ ఒక్కరంటే ఒక్క నేత కూడా చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.