Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పరిశుభ్రతా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. కేంద్రం తలపెట్టిన స్వచ్ఛతా హి సేవ (ఎస్హెచ్ఎస్)లో అగ్రస్థానం సాధించింది. ఎస్హెచ్ఎస్లో భాగంగా దేశంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్రంగా, అత్యధిక శాతం జనాభా పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ ముందున్నది.
ఈ విషయాన్ని శనివారం కేంద్ర పారిశుద్ధ్యం, జల్శక్తి మంత్రిత్వశాఖ స్వయంగా ప్రకటించింది. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో ఎస్హెచ్ఎస్లోనూ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. చెత్తరహిత భారత్ ఇతివృత్తంగా శ్రమదానంతో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిని ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో నిర్వహించారు. టాప్ 10 రాష్ట్రాల్లో మూడు మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, మిగిలినవన్నీ బీజేపీయేతర రాష్ర్టాలే ఉన్నాయి.
ప్రతి గ్రామం ఓడీఎఫ్ ప్లస్..
తెలంగాణలోని ప్రతి గ్రామం ఓడీఎఫ్ ప్లస్గా ఏడాది క్రితమే గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్లో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ (ఎస్హెచ్ఎస్) కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ నెల 16న ప్రారంభించారు. ఎస్హెచ్ఎస్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్దఎత్తున చేపడుతున్నారు. దీనిలో విద్యార్థులను, ప్రజలను, మహిళా సంఘాల ప్రతినిధులను, గ్రామ సిబ్బంది ప్రత్యేకంగా భాగస్వాములను చేస్తున్నారు.
స్వచ్ఛత వాక్, స్వచ్ఛత ర్యాలీ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై సంతకాల సేకరణ, స్వచ్ఛత ప్రతిజ్ఞ, మానవహారం తదితర కార్యక్రమాలను చేపట్టారు. గ్రామాల్లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుంచి చెత్తను తొలగించడం, చెత్తకుండీలు క్లినింగ్, పబ్లిక్ టాయిలెట్లు, వ్యర్థ రవాణా వాహనాలను శుభ్రంగా ఉంచడం, పెయింటింగ్, బ్రాండింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దీనితో దేశంలో అత్యధిక కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కేంద్ర జల్శక్తి శాఖ.. తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉన్నట్టు ప్రకటించింది.