కరీంనగర్ : తెలంగాణ విద్యా, వైద్యంతో పాటు క్రీడారంగంలోనూ ముందంజలో ఉందని రాష్ట్ర క్రీడల అభివృద్ధి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి పర్యటించారు. అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ తోపాటు స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన వాలీబాల్ కోర్టును మంత్రులు ప్రారంభించారు.అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ క్రీడా పాఠశాల సమీపంలో స్టేడియం నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.జిల్లాకు ఒక మెడికల్ కళాశాలతో దేశ ప్రజలకు వైద్యం చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై పార్లమెంట్ లో విపక్ష ఎంపీలే ప్రశంసిసున్నారని చెప్పారు.
కేసీఆర్ కు కరీంనగర్ జిల్లాపై ప్రత్యేకాభిమానం ఉందని వెల్లడించారు. కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ తో కరీంనగర్ కు పర్యాటక శోభ సంతరించుకుంటుందన్నారు.క్రీడల్లో రాణిసున్న క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తామని, రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ది చెందుతుందని తెలిపారు.