CM KCR | జూన్ రెండో తేదీ నుంచి మూడు వారాల పాటు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కే చంద్రశేఖర్రావు సమావేశమయ్యారు. ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. `కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ వచ్చింది. సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటీ పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నది` అని అన్నారు.
`నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిన్నాడు కేవలం 8 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నం. ఒక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువులను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శనిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. ఒకనాడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ను దాటేసి పోతున్నం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
`ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా పరిపాలనను నిర్థిష్ట లక్ష్యంతో ముందుకు కొనసాగించడం జరిగింది. తత్పలితంగా దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగాం` అని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు విద్యా వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
తెలంగాణ విద్యార్థుల నీట్ , ఐఎఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. కాగా నారాయణ్ పేట్ ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు సివిల్ సర్వీసెస్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకును సాధించిన నేపథ్యంలో సమావేశం అభినందనలు తెలిపింది.