వ్యవసాయ యూనివర్సిటీ, ఏప్రిల్ 7: పశు సంపద వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అఖిల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భూపేంద్రనాథ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పశు సంపదను ఇంత త్వరగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని వెల్లడించారు. 2021లో రూ.5,400 కోట్ల విలువైన చేపలు, రూ.1,679.80 కోట్ల విలువైన గుడ్లు, 14.16 మిలియన్ మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందని వివరించారు.
గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన 3వ స్నాతకోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. మూడేండ్లలోనే దేశమంతా విశ్వవిద్యాలయం వైపు చూసేలా అద్భుతమైన ఫలితాలు సాధించారని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చినవారికి బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ రవీందర్రెడ్డి, రిజిస్ట్రార్ ఎస్టీ వీరోజిరావు, డీన్ టీ రఘునందన్ పాల్గొన్నారు.