జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి వినూత్న పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిదిన 67 మంది దివ్యాంగులకు రూ. 37.27 లక్షల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలు, బ్యాటరీ వీల్చైర్లు, స్కూటీలు అందజేశారు. అర్హులైన దివ్యాంగులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పూర్తి సబ్సిడీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వానికి ఆత్మ సంతృప్తి ఉంటుందని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతూ ఉంటారని వెల్లడించారు.
గత పాలకులు దివ్యాంగులను పట్టించుకోలేదని ఆరోపించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మస్థైర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు.
దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ , మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టి బాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, గొల్లపల్లి జడ్పీటీసీ గొస్కుల జలేంధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేశ్, వైస్ చైర్మన్ సునీల్, సౌళ్ల సురేశ్, పార్టీ అధ్యక్షులు శేఖర్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.