హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. విస్తారంగా కురిసిన వానలు.. రైతుబంధు కింద పెట్టుబడి సాయం.. నిరంతర విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయం పరిఢవిల్లుతున్నది. దేశానికి అన్నం పెడుతూ సాకుతున్నది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఒకనాడు పనికిరావని బంజరు భూముల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయి.
రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం
తెలంగాణ ఆవిర్భావం నాటికి సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలు. రాష్ర్ట ప్రభుత్వ తోడ్పాటుతో నేడు 2.3 కోట్ల ఎకరాలకు విస్తరించింది. దీనికి అదనంగా 11.50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి. 2014-15 నాటికి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు అయితే.. 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు పెరిగింది. 2014-15లో పత్తి సాగు 41.83 లక్షల ఎకరాలు కాగా.. 2020-21 నాటికి 60.53 లక్షల ఎకరాలకు చేరుకొన్నది. రాష్ట్రంలో అన్నిరకాల పంటల ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరడం సాధారణ విషయం కాదు. రైతు పండించిన ధాన్యాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6.06 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. సాలీనా ఏడాదికి దాదాపు రూ.10,500 కోట్లు భరించి ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10 వేల చొప్పున గత 9 విడతల్లో రూ.57,881 కోట్లను పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతుబీమా ద్వారా 88,963 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం అందజేసింది.
పెరిగిన ప్రజల తలసరి ఆదాయం
సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. 2014-15లో రూ.1,12,162 ఉండగా, 2021-22 నాటికి రూ.2,78,833కు పెరిగింది. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం నియమించింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల 6.66 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. పండించిన పంటలను దాచేందుకు సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నది. 2014-15లో గోదాముల సామర్థ్యం 39 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ప్రస్తుతం 68.28 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. విత్తన కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తూ అక్రమార్కుల వణుకు పుట్టిస్తున్నది.
యాంత్రీకరణకు పెద్దపీట
వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పించింది. 2014-15లో రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 94,537 కాగా, ప్రస్తుతం 3.52 లక్షలకు పెరిగాయి. 2014-15లో 6,318 హార్వెస్టర్లు ఉండగా, ప్రస్తుతం 19,309కు చేరాయి. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తెలంగాణ వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని నూటికినూరుపాళ్లు చెప్పొచ్చు.