Vedire Sriram | హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నదీజలాల్లో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని, న్యాయమైన నీటి వాటా కేటాయింపులు చేయలేదని, ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలని చట్టం చేసిందే నాటి యూపీఏ సర్కార్ అని కేంద్రజల్శక్తిశాఖ మంత్రి సలహాదారు, ఐఆర్ఎల్పీ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. నాడు అనాలోచితంగా చట్టం చేసి నేడు ఆ తప్పిదాలను కేంద్ర సర్కారుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
నగరంలోని కవాడిగూడ సీజీవో టవర్స్లో కేంద్ర జల్శక్తిశాఖ తరఫున గురువారం మధ్యా హ్నం ఆయన మీడియాతో మాట్లాడా రు. గోదావరి నదిపై ఉన్న పలు ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ, నూతన మార్గదర్శకాలు, మేడిగడ్డ బరాజ్ ఘటన, కేఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి న విధానాన్ని తప్పుబట్టారు. మేడిగడ్డ బరాజ్ కుంగిన వెంటనే కేంద్రం స్పందించి ఎన్డీఎస్ఏ బృందాన్ని తెలంగాణకు పంపిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నివేదికలు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిందని వెల్లడించారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి నివేదికలు ఇవ్వవడం లేద ని, ఎన్డీఎస్ఏకు సహకరించడం లేదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుతో ఇప్పటికే 4 నెలల సమయం వృథా అయినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కమిటీ వారం రోజుల్లో పునరుద్ధరణ చర్యలపై నెల రోజుల్లో సిఫార్సు చేస్తుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల స్వాధీనం అందుకే
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు అప్పగించాలని ఏపీ పునర్విభజన చట్టం-2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొన్నదని, దాని ప్రకారమే ప్రా జెక్టులను ఇప్పుడు కేఆర్ఎంబీ స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. నీటి కేటాయింపులు లే కుండానే ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చని రా ష్ర్టాలకు చెప్పిందని, విద్యుత్తు ప్రాజెక్టులను ఒకచోట, రివర్ బోర్డులు మరోచోట రాష్ర్టాలే నిర్వహించుకుంటాయని అసంబద్ధంగా, అస్పష్టత తో చట్టాన్ని రూపొందించిందని దుయ్యబట్టా రు. నీటి వాటాలను న్యాయంగా పంపిణీ చేసే లా ట్రిబ్యునల్ 2కు మార్గదర్శకాలు జారీచేయలేదని మండిపడ్డారు. నేటి జల వివాదాలకు నాటి కాంగ్రెస్ తప్పిదాలే కారణమన్నారు.
ప్రమాదకరంగా శ్రీశైలం
శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నదని శ్రీరాం ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రాజెక్టును సందర్శించిన ఎన్డీఎస్ఏ వెంటనే మరమ్మతులు చేయాలని సూచించిందని గుర్తుచేశారు. ఇటీవల ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించిందని పేర్కొన్నారు. ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, నిర్వహణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాగార్జునసాగర్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం బాగానే చేసిందని, ఏపీ ఆక్రమణ తర్వాత కుడివైపున మరమ్మతులకు అక్కడి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని వివరించారు. కేఆర్ఎంబీని, కేంద్రాన్ని, సీడబ్ల్యూసీని నిందించడం తగదని ఇరు రాష్ర్టాలకు హితవు పలికారు.