హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. 2024 -25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు గురువారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆయా కాలేజీల్లో ఈ నెల 31వరకు విద్యార్థులు దరఖాస్తులను అందజేయవచ్చు. జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఇక పదో తరగతి ఇంటర్నెట్ మెమో(షార్ట్) ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు చేసుకోవచ్చని ఇంటర్బోర్డు సెక్రటరీ శృతి ఓజా వెల్లడించారు.
ఎస్సెస్సీ ఒరిజినల్ మెమో, టీసీ అందజేసిన తర్వాత రెగ్యులర్ అడ్మిషన్లుగా పరిగణిస్తామని తెలిపారు. గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందాలని సూచించారు. వివరాలకు https://acadtsbie.cgg.gov.in/, https://tsbie.cgg.gov.in వెబ్సైట్లను సంప్రదించాలన్నారు. రిజర్వేషన్ల ప్రకారమే విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీ 29%, ఈడబ్ల్యూఎస్ 10 %, మాజీ సైనికులు 3%, దివ్యాంగులు 5%, ఎన్సీసీ, స్పోర్ట్స్ 5% చొప్పున సీట్లను కేటాయిస్తారు.