ఇంటర్ బోర్డు వద్ద రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు ఆందోళన చేయటం సరికాదు. పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోణంలో ఆలోచించాలి. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లల్లో ధైర్యం నూరిపోయాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, సెకండియర్ పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరినీ పాస్ చేయాలని నిర్ణయించాం. ఇలాగే ఆందోళనలు చేస్తే సెకండియర్లోనూ పాస్ చేస్తారని ఆశించొద్దు. బాగా చదివి మంచి మార్కులు సాధించాలి.
–విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 35 శాతం మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. బషీర్బాగ్లోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు మార్కులు పెంచుకోవాలనుకొంటే త్వరలో నిర్వహించే సెకండియర్ పరీక్షలతోపాటు ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చని చెప్పారు. ఇలా పాస్ చేయటం ఈ ఒక్కసారికే పరిమితమని స్పష్టంచేశారు. ఇదే మొదటిసారి, చివరిసారి అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.
గత అక్టోబర్లో నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,59,242 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,24,012 మంది పాసయ్యారు. 2,25,230 మంది ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరంతా 35 శాతం మార్కులతో పాస్ కానున్నారు. పరీక్ష ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలపై మంత్రి సబిత ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ చదువు టర్నింగ్ పాయింట్ అని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. ఫెయిల్ అయ్యామన్న బాధతో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరీక్షల్లో పాస్, ఫెయిల్ జీవితంలో ఒక భాగం మాత్రమేనని, ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాలను కోల్పోరాదని హితవు పలికారు. పరీక్ష ఫలితాల రీ వెరిఫికేషన్కు 39,039 మంది, రీ కౌంటింగ్కు 2,400 మంది దరఖాస్తు చేసుకున్నారని, విద్యార్థులు కోరుకుంటే వారు చెల్లించిన ఫీజులను వాపస్ చేస్తామని మంత్రి తెలిపారు. ఎక్కువ మార్కులొస్తాయని నమ్మకమున్నవారు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయించుకోవచ్చని, అవసరం లేదనుకుంటే ఫీజులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆప్షన్లు ఇంటర్బోర్డు వెబ్సైట్లో ఉంటాయని వివరించారు.
పరీక్ష ఫలితాల వెల్లడిలో ఎలాంటి తప్పు జరుగలేదని మంత్రి సబిత స్పష్టంచేశారు. ప్రభుత్వపరంగా తప్పు లేకున్నా ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను నిందించడం సరికాదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మానవతా దృక్పథంతో గ్రేస్ మార్కులు కలిపే ప్రయత్నం చేసినా ఫలితం నామమాత్రంగానే ఉన్నదని చెప్పారు. 30 మార్కులవరకు కలిపినా పాస్ అయ్యేవారి సంఖ్య 1,51,262 మాత్రమేనని, మిగిలిన 72,750 మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అందరినీ పాస్ చేశామని వివరించారు. ‘తక్కువ తేడాతో ఫెయిల్ అయినవారి సంఖ్య చాలా తక్కువ. 5 మార్కుల వరకు కలిపితే 14 మంది, 10 మార్కుల వరకు 8,076 మంది, 15 మార్కులు కలిపితే 24,740 మంది, 20 మార్కుల వరకు కలిపితే 58,892 మంది, 25 మార్కుల వరకు కలిపితే 72,982 మంది, 30 మార్కులు కలిపితే పాసయ్యేవారు 83,968 మంది ఉన్నారు. ఈ పరీక్షల్లో 10 వేల మంది 95 శాతం మార్కులతో పాస్ అయ్యారు’ అని వివరించారు.
ఇంటర్ బోర్డు వద్ద రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు ఆందోళన చేయటం సరికాదని మంత్రి సబిత అన్నారు. పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి విద్యార్థుల భవిష్యత్తు కోణంలో ఆలోచించాలని హితవుపలికారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లల్లో ధైర్యం నూరిపోయాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును, సెకండియర్ పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరినీ పాస్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇలాగే ఆందోళనలు చేస్తే సెకండియర్లోనూ పాస్ చేస్తారని ఆశించొద్దని స్పష్టంచేశారు. బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఫెయిల్ అయినవారిలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులే అధికంగా ఉన్నారన్న విమర్శలను మంత్రి సబిత కొట్టిపారేశారు. ఫస్టియర్ ఉత్తీర్ణతా శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటున్నదని తెలిపారు. కరోనా ప్రభావంతో అన్ని యాజమాన్యాల్లోని విద్యార్థులు ప్రభావితమయ్యారని చెప్పారు. తాజా నిర్ణయంతో ఇంటర్ ఫస్టియర్తోపాటు సెకండియర్లో వరుసగా రెండేండ్లు వందశాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. గతేడాది కరోనాతో సెకండియర్, ఫస్టియర్లో ఫెయిలైనవారంతా 35 శాతం మార్కులతో పాస్కాగా, బ్యాగ్లాగ్స్ ఉన్నవారిని సైతం ఇదే తరహాలో పాస్ చేశారు. మార్చిలో సెకండియర్వారికి 35 శాతం మార్కులేసి పాస్ చేయగా, తాజాగా ఫస్టియర్ విద్యార్థులు 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి, అధ్యాపక సంఘాలు స్వాగతించాయి. తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరీ సతీశ్, ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ రామకృష్ణగౌడ్, కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ -475 ప్రధాన కార్యదర్శి సురేశ్, గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఆర్ కృష్ణయ్యకాచిగూడ, డిసెంబర్ 24: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని జాతీయ బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులందరినీ పాస్ చేయాలని శుక్రవారం ఉదయం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సంఘం నేత గుజ్జ కృష్ణ, తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిక మల్లేశ్, సైదులు గౌడ్, చంటి ముదిరాజ్, నిఖిల్ తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు.