హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై మొద టి నుంచి వివక్ష చూపుతున్న బీజేపీ ప్రభుత్వానికి, ఇక్కడి ఎంపీలకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయంపై గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర విభజన హామీల గురించి బడ్జెట్లో ప్రస్తావించక పోవడం శోచనీయమని పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి హామీలను విస్మరించిన కేంద్రం.. తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం.. బీజేపీయేతర రాష్ర్టాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్రానికి చెం దిన నలుగురు బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం శోచనీయమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి, ఇక్కడి ఎంపీలకు తగిన బుద్ధిచెప్పాలని కోలేటి పిలుపునిచ్చారు.