హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా దివ్యాంగుల సంక్షేమానికి, సంరక్షణకు, హక్కుల పరిరక్షణకు ప్రత్యే క ప్రాధాన్యం ఇస్తున్నది. నెలకు రూ.3,016 పింఛన్ అందిస్తున్నది. సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తున్నది. దివ్యాంగులకు న్యాయపరమైన రక్షణ కల్పిస్తున్నది. దివ్యాంగుల హక్కు ల చట్టం-2016ను కట్టుదిట్టంగా అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దివ్యాంగుల సలహా మండలిని ఏర్పాటు చేసింది. చట్టానికి అనుగుణంగా అన్ని ఆర్థిక పథకాల్లోనూ 25% శాతం అదనంగా నిధులు కేటాయిస్తున్నది. దివ్యాంగులకు 5% రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. సామాజికంగా, వ్యవస్థల పరంగా వివక్షకు గురైనా, వారి హక్కులకు ఏ మాత్రం భంగం వాటిల్లినా బాధిత దివ్యాంగులకు అండగా నిలబడుతున్నది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫిర్యాదులతో సంబంధం లేకుండా స్వయంగా జోక్యం చేసుకుంటూ దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్నది. దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తున్నది.
మా భూమి మాకు ఇప్పించారు
మాది నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం దొనియాల గ్రామం. భార్యాభర్తలం ఇద్దరం దివ్యాంగులమే. 2005లో గ్రామంలో 3.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అయితే కొందరు గ్రామస్తులతోపాటు అమ్మినవారి సమీప బంధువులు మేము పంట కోసుకోకుండా ఇబ్బంది పెట్టారు. భూమిని ఆక్రమించారు. పెద్దమనుషులతో పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టుకు వెళ్లా. మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా కొందరు రెవెన్యూ అధికారులు సహకరించలేదు. మోఖాపై రాకుండా, హద్దులు పెట్టకుండా, భూమిని అప్పగించకుండా ఇబ్బంది పెట్టారు. చివరకు దివ్యాంగుల హక్కుల చట్టం గురించి తెలుసుకొని కమిషనర్ శైలజకు దరఖాస్తు పెట్టాను. కమిషనర్ వెంటనే స్పందించి నోటీసులు జారీ చేశారు. భూమి అమ్మకందారును కూడా పిలిపించి మాట్లాడారు. ఆ భూమిని మాకు అప్పగించాలని ఆర్డర్ ఇచ్చారు. ఇటీవల కొత్త పట్టాదార్ పాస్పుస్తకాలు మా పేరు మీదనే వచ్చాయి. ప్రభుత్వానికి, కమిషనర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సరిపల్లి ధనలక్ష్మి, బాలస్వామి దంపతులు
పీడబ్ల్యూడీ కోటాలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది
ఈ ఏడాది టీఎస్ ఎంసెట్లో 72,386 ర్యాంకు సాధించాను. మొదటి విడత కౌన్సెలింగ్ సమయానికి దివ్యాంగుల సర్టిఫికెట్ రాలేదు. ఓపెన్ కోటాలో సీటు కేటాయించారు. ఆ తరువాత రెండు రోజులకు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో రెండో విడత కౌన్సెలింగ్లో పీహెచ్సీ కోటాలో సీటును కేటాయించే విధంగా చూడాలని దివ్యాంగుల సంక్షేమశాఖ కమిషనర్కు విజ్ఞప్తి చేశాను. కమిషనర్ వెంటనే టీఎస్ ఎంసెట్ కన్వీనర్కు లేఖ రాశారు. దీంతో రెండో విడతలో పీహెచ్సీ కోటాలోనే సీటు కేటాయించారు. సీబీఐటీలో సీటు పొందాను. ప్రభుత్వానికి, కమిషనర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– రోహిత్, ఇంజినీరింగ్ విద్యార్థి
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక రక్షణ చర్యలు చేపడుతున్నది. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నది. అందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా తీసుకొచ్చింది. బాధితులు ఎవరైనా నేరుగా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– శైలజ, దివ్యాంగుల సంక్షేమశాఖ కమిషనర్
రాష్ట్ర కమిషనర్కు ఉన్న అధికారాలు
సివిల్ ప్రొసీజర్ కోడ్-1908 ప్రకారం రాష్ట్ర కమిషనర్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. రాష్ట్ర కమిషనర్ సమక్షంలో జరిగే చర్యలన్నింటినీ భారత శిక్షాస్మృతిలోని 193, 228, సెక్షన్ల ప్రకారం న్యాయపరమైన చర్యలుగా పరిగణించాల్సి ఉంటుంది.
దివ్యాంగులకు ఉచిత శిక్షణ
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిసెబిలిటీ (ఏపీడీ) సంస్థ సహకారంతో ఎంఎస్ ఆఫీస్, రిటైల్ అండ్ ఈ కామర్స్ తదితర విభాగాల్లో దివ్యాంగులకు ఉచిత శిక్షణనిస్తామని అభిశ్రీ ఫౌండేషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 45 రోజుల శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు వెల్లడించింది. 10వ తరగతి పాసైన లేదా ఇంటర్, డిగ్రీ ఫెయిలైన 35 ఏండ్లలోపు దివ్యాంగ అభ్యర్థులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు 8008861623, 9959723268 నంబర్లలో సంప్రదించాలని కోరింది.