హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సీట్ల కేటాయింపునకు నిర్వహించే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కౌన్సెలింగ్ను సెప్టెంబర్ 6కు వాయిదా వేశారు. సెప్టెంబర్ 6 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 17న సీట్లను కేటాయిస్తారు. ఇక సెప్టెంబర్ 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, 28న సీట్లను కేటాయిస్తారు.
ఈ రెండు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో సీటు వచ్చిన కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను సెప్టెంబర్ 29న విడుదల చేస్తారు. ఇటీవలి వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం డిగ్రీ పరీక్షలు ఈ నెల 14 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరుకు వచ్చే అవకాశముంది. ఈ ఫలితాలు విడుదల కానిదే.. సర్టిఫికెట్లు చేతికందనిదే సీట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఐసెట్ సీట్ల భర్తీ షెడ్యూల్లో మార్పులు చేశారు.