హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏను వచ్చే నెల వేతనంతో కలిపి చెల్లించనున్నట్టు వేర్వేరుగా జారీ చేసిన రెండు జీవోల్లో పేర్కొన్నది. పెరిగిన డీఏలు ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా వర్తించనున్నాయి. ఇటీవల సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి.. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను చెల్లించడానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 డీఏలు కలిపి 10.01 శాతాన్ని వచ్చే నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు. జనవరి 2020 చెల్లించాల్సిన డీఏ 3.64%, జూలైలో 2.73%, 2021 జనవరిలో చెల్లించాల్సిన 3.64%.. మొత్తం కలిపి 10.01 శాతాన్ని వచ్చే నెల వేతనంతోపాటు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. జూలై 1 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్లో జమ చేస్తారు. 2022 జనవరి నుంచి మూడు డీఏలను ఫిబ్రవరిలో అందుకొనే వేతనంతో కలిపి చెల్లించనున్నారు. పెన్షనర్లకు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరు విడతల్లో బకాయిలను అందించనున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన కారణంగా డీఏల చెల్లింపులో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు డీఏలను కలిపి వచ్చే నెల వేతనంతో పాటే చెల్లిస్తామని ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు మూడు డీఏలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మాచారి, అధ్యక్షుడు రవీందర్కుమార్, ప్రధాన కార్యదర్శి హర్షకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
మూడు డీఏలను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు పెన్షనర్ల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఇది పెన్షనర్లకు ఎంతో ఊరటనిస్తుందని సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య తెలిపారు. ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు అసోసియేషన్ ఆఫ్ కాలేజియేట్ టీచర్స్ చైర్మన్ తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వారికి కూడా అవకాశం కల్పించాలని కోరారు.