హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ముందస్తు అడ్మిషన్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా బాధితుల కారణంగా హైదరాబాద్లోని దవాఖానల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏ దవాఖానకు వెళుతున్నారో, ఎక్కడ వైద్యం చేయిస్తారో కూడా తెలియకుండా హైదరాబాద్కు వస్తున్నారని.. వారు అనేక దవాఖానల చుట్టూ తిరుగుతుండటం కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని వెల్లడించింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ‘ముందస్తు అనుమతి’ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నది. ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ఆంక్షలు అమలుచేశాయని వివరించింది. ఇతర రాష్ట్రాల వాళ్లకు హైదరాబాద్లో వైద్యం చేయకూడదనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, ప్రైవేటు దవాఖానల్లో పడకలు బుక్ చేసుకొని అంబులెన్స్లో వచ్చే కరోనా రోగులను అనుమతిస్తున్నామని తెలిపింది. హైదరాబాద్లోని దవాఖానల్లో సగానికిపైగా కరోనా బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని రాష్ర్ట ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ శుక్రవారం హైకోర్టుకు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి కొవిడ్ బాధితులతో వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు నిలిపివేయడం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి గరిమెళ్ల వెంకట కృష్ణారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి హైదరాబాద్కు కరోనా రోగులు పెద్దసంఖ్యలో వస్తున్నారని తెలిపారు. పడకలు అందుబాటులో లేక ఎంతోమంది రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ పరిస్థితులు విషమిస్తున్నందునే సర్క్యులర్ జారీచేయాల్సి వచ్చిందని వివరించారు. పడకల వసతి ఉన్నదని నిర్ధారణ చేసుకున్న అంబులెన్స్లను అనుమతి ఇస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. కారణాలు ఏమైనా కావచ్చు.. మీరు చెప్పేదాని ప్రకారం జిల్లాల నుంచి వచ్చే రోగులు హైదరాబాద్లోని దవాఖానల్లో పడకలు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే వస్తున్నారా? అయినా, కేంద్రప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకల్ని నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడ ఉన్నది? అని ప్రశ్నించింది. తాము తిరిగి ఉత్తర్వులు జారీచేసేవరకూ ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అంబులెన్స్లను ఆపడడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీచేసింది. అవసరమైతే కంట్రోల్ రూంకు ఫోన్ చేసుకుంటారని, అప్పుడు మాత్రం కంట్రోల్రూం సిబ్బంది సహకరిస్తే సరిపోతుందని సూచించింది. ఏపీ ఏజీ ఎస్ శ్రీరావ్ు వాదిస్తూ, చట్టాలు, రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. వాదనల అనంతరం ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం విచారణను జూన్ 17కి వాయిదావేసింది.